కేంద్రం చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ

న్యూఢిల్లీ:

ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిట్టనిలువునా ఖూనీ చేసేలా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. 'ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు -2013'ను అసెంబ్లీ తిరస్కరించినా దాన్ని ఆమోదించాలని కేంద్రం మొండిగా ముందుకు వెళ్తోందని విమర్శించారు. దేశ ప్రథమ పౌరుడిగా ఇలాంటి అన్యాయాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ‌శ్రీ జగన్మోహన్‌రెడ్డి కోరారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయ‌స్ విజయమ్మ ఆధ్వర్యంలో ‌పార్టీ ప్రజాప్రతినిధుల బృందం బుధవారం సాయంత్రం రాష్ట్రపతితో భేటీ అయింది. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ తరఫున శ్రీ జగన్ నాలుగు పేజీల వినతిప్రతాన్ని ‌రాష్ట్రపతికి అందజేశారు.

అనంతరం శ్రీ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో రాష్ట్రాల విభజన ఆయా రాష్ట్ర అసెంబ్లీల ఆమోదంతోనే జరిగిందని గుర్తుచేశారు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చేసరికి కేంద్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీరు ఉందని దుయ్యబట్టారు. దేశ చరిత్రలో ఇందకు ముందు ఏనాడూ లేని విధంగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నదని ఆరోపించారు.

విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ దానిని వ్యతిరేకిస్తూ అఫిడవిట్లు సమర్పించిన వైనాన్ని, సభా నిబంధనల కింద పలుమార్లు బిల్లును వెనక్కి తిప్పి పంపాలంటూ కోరిన విషయాన్ని రాష్ట్రపతికి సమర్పించిన వినతి పత్రంలో శ్రీ జగన్ గుర్తుచేశారు. బిల్లును తిప్పి పంపాల‌ంటూ అసెంబ్లీ కూడా తీర్మానం చేసిందని ఆయన వివరించారు. గతంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏ‌ర్పాటు చేయడానికి ముందు ఆయా మాతృ రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి ఆయన తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనను శ్రీకృష్ణ కమిటీ సైతం వ్యతిరేకించినా, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా ముందుకు వెళుతూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని వివరించారు.

ఈ నేపథ్యంలో అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా చూడాలని రాష్ట్రపతి‌ ప్రణబ్‌ ముఖర్జీకి శ్రీ జగన్ విజ్ఞపి చేశారు. తాము చెప్పిన విషయాలన్నీ విన్న రాష్ట్రపతి విభజన విల్లు విషయంలో ఏది మంచిదో అది చేస్తామని, తాను చేయగలిగిందంతా చేస్తానని హామీ ఇచ్చారని శ్రీ జగన్ ‌తెలిపారు.

ఇంకెక్కడా లేని అన్యాయం ఇది:
రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తీరును రాష్ట్రపతికి వివరించామని శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీడియాకు చెప్పారు. దేశచరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం తెగబడుతోందని విమర్శించారు. అన్ని అంశాలపైనా రాష్ట్రపతితో సుదీర్ఘంగా చర్చించామని ఆయన తెలిపారు. దేశంలో కనీవినీ ఎరగని రీతిలో మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. గతంలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన తర్వాతే కేంద్రం రాష్ట్రాలను విడగొట్టిందన్నారు. మొదటిసారి విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించినా, దాన్ని తిప్పిపంపినా కేంద్రం అన్యాయంగా విభజన చేసేందుకు ముందుకు వెళుతోందని నిప్పులు చెరిగారు. విభజన విషయంలో తాము చెప్పిందంతా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సావధానంగా విన్నారని చెప్పారు. ఈ విషయంలో ఏది మంచో అది చేస్తానని రాష్ట్రపతి చెప్పారన్నారు. దేవుడిపై తమకు నమ్మకం ఉందని, విభజన జరగదనే విశ్వసిస్తున్నామని శ్రీ వైయస్‌ జగన్ అన్నారు.

బిల్లును పార్లమెంట్‌లో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తాయి :
విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తాయని తమకు పూర్తి నమ్మకం ఉందని  శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే తాము తిరిగి జాతీయ పార్టీల అధ్యక్షులను కలిశామని శ్రీ జగన్‌ తెలిపారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయం రేపు మీకు కూడా జరుగుతుందని వారికి స్పష్టం చెప్పామన్నారు. అడ్డగోలుగా బిల్లును తేవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తే ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలిచి వ్యతిరేకిస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

అడ్డగోలుగా వస్తున్న తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతిస్తుందని తాము భావించడం లేదని ఒక ప్రశ్నకు శ్రీ జగన్‌ జవాబు ఇచ్చారు. గతంలో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశామని, బుధవారం పార్లమెంట్‌లో అరుణ్‌ జైట్లీని కలిశామన్నారు. ముఖ్య నేతలందరినీ  కలుస్తున్నామన్నారు. మరోసారి కూడా అందరినీ కలుస్తామన్నారు. బిల్లును అడ్డుకోవాలని వారిని కోరతామని శ్రీ జగన్‌ తెలిపారు.

ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తాం :
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎవరు అవిశ్వాసం పెట్టినా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుందని‌ ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు శ్రీ జగన్ సమాధానం చెప్పారు. మరో 20 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తోందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ‌పార్టీ ఇంటి దారి పట్టక తప్పదన్నారు. ఎన్నికలు వస్తున్న ఈ తరుణంలో అవిశ్వాసానికి అర్థం లేదన్నారు. ఎన్నికల తరుణంలో లబ్ధి పొందేందుకు టీడీపీ అవిశ్వాసం ఇచ్చిందన్నారు.

రాష్ట్రపతిని కలిసిన వారిలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి, ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, జి. శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, కృష్ణదాస్, విశ్వరూప్, ఆదినారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి తదితరులు ఉన్నారు.

రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రం సారాంశం :
రాజ్యాంగ నిబంధనలు, సంప్రదాయాలను కాలదన్నుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 2013, డిసెంబర్ 26న హైదరాబా‌ద్‌లో మా పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు మీకు అఫిడవిట్లను సమర్పించాం. గతంలో ఏర్పాటు చేసిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలోనూ.. ఆయా అసెంబ్లీలు విభజనకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాలు చేసిన తరువాతే ఆయా రాష్ట్రాలను విభజించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం.

మిగతా రాష్ట్రాల ఏర్పాటు కూడా సంబంధిత కమిషన్ లేదా కమిటీ సిఫారసుల ఆధారంగానే జరిగింది. ఆంధ్రప్రదే‌శ్ రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా విభజనను వ్యతిరేకించింది. విభజన కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ నుంచి కూడా ఎలాంటి తీర్మానం రాలేదు. అయినప్పటికీ, రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా పదేళ్ల పాలన ముగుస్తున్న ఘడియల్లో రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం తొందరపడుతోంది. భాషా‌ ప్రాతిపదికన ఏర్పడిన 57 ఏళ్ల చరిత్ర కలిగిన రాష్ట్రాన్ని విభజించడానికి సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని టేబుల్ ఐట‌మ్‌గా తీసుకుని కేంద్ర కేబినెట్ చర్చించింది. ఇది కేబినె‌ట్ సమ‌ష్టి బాధ్యతను అగౌరవించడమే అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపిన బిల్లులోనూ అత్యంత ముఖ్యమైన అంశాలైన.. లక్ష్యాలు, కారణాలు.. ఆర్థిక మెమొరాండం, విభజన అనంతర పరిణామాలు మొదలైన అంశాలు లేకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఇది కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనం.

మా పార్టీ అసెంబ్లీ నిబంధన 77, 78 కింద రెండు తీర్మానాలను ప్రతిపాదించింది. అవి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ ఒకటి, బిల్లును వెనక్కి పంపించాలని కోరుతూ మరొకటి. అలాగే, అసెంబ్లీలోనూ బిల్లుకు వ్యతిరేకంగా మా పార్టీ సభ్యులు తమ లిఖితపూర్వక అభిప్రాయాలను తెలిపారు. అలాగే, బిల్లులోని మొత్తం 108 క్లాజులను, 13 షెడ్యూళ్లను తొలగించాలని కోరుతూ సవరణలు ప్రతిపాదించారు. అసెంబ్లీలోని మొత్తం 279 సభ్యుల్లో 157 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ అభిప్రాయాలు తెలిపినట్లు మాకు తెలిసింది.

అలాగే, బిల్లును తిరిగి పంపించడానికి చివరి రోజైన జనవరి 30, 2014 నాడు దాదాపు సభ్యులందరూ తమ అభిప్రాయాలను తెలిపినట్లు ప్రకటించారు. అదే రోజు మేము ప్రతిపాదించిన అనధికార తీర్మానాలే కాకుండా.. రాష్ట్ర  సీఎం కిరణ్ ఆంధ్రప్రదే‌శ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరిస్తున్నట్లుగా తీర్మానం ఇచ్చారు. అలాగే, ఎలాంటి కారణం, ప్రాతిపదిక లేకుండా, ఏకాభిప్రాయం కుదరకుండానే రాష్ట్రాన్ని విభజిస్తున్నందున ఆ బిల్లును పార్లమెంటుకు పంపవద్దని కూడా రాష్ట్రపతిని కోరుతూ తీర్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానం మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందిందని స్పీక‌ర్ ప్రకటించారు. అందువల్ల పూర్తి మెజారిటీతో అసెంబ్లీ, శాసనమండలి తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌కు సిఫారసు చేయకూడదని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము.'

Back to Top