గుంటూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే కేంద్రం దిగివచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేదని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు దీక్షలో ఆయన మాట్లాడుతూ..ఐదు, పది కాదు ఏకంగా 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న వాళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలను మోసం చేశాయని.. అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా కన్నా ప్యాకేజీయే గొప్పదన్నారని చెప్పారు. రాష్ట్రానికి హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు.<br/>2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హోదా కావాలన్నారని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం హోదా కంటే ప్యాకేజీయే గొప్పదని ప్రకటించారని, మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారని, టీడీపీ స్టాండ్ ఇదేనని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా వైయస్ జగన్తోనే సాధ్యం అవుతుందని తేల్చి చెప్పారు.