రాష్ట్ర విభజన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

న్యూఢిల్లీ‌ :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) సభ్యుడు డీఏ సోమయాజులు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారంనాడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్హేతుక నిర్ణయంతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిపోయిందని, సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయని, ఆస్తి, ప్రాణ నష్టాలు చోటుచేసుకుంటున్నాయని పిల్‌లో ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పాటుపై అక్టోబర్ 3న కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించా‌లని సోమయాజులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల విభజనకు సహేతుకమైన విధానాన్ని రూపొందించే వరకు కొత్త రాష్ట్రాల ఏర్పాటును నిలిపివేయాలని విన్నవించారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎలాంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టకుండా రాష్ట్రపతిని నిలువరించాలని‌ సోమయాజులు తన పిల్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కేంద్రంలోని అధికార పార్టీ చేతిలో‌ ఆర్టికల్ 3 ఒక ఆయుధంలా మారకూడదని, దాని రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలను అడ్డగోలుగా విభజించేందుకు దోహదం చేయకూడదని పిటిషనర్‌ సోమయాజులు తరఫున సీనియర్ న్యాయవాది హరీ‌ష్‌ సాల్వే పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత సరైన విధానాల ప్రకారమే రాష్ట్రాల విభజన జరగాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని చూస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరగాలని రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1956 చెబుతోందని పిటిషన్‌లో వివరించారు.

ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో ఇది వర్తించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వాటి మాతృ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అసెంబ్లీ‌లలో విభజనకు అనుకూలంగా చేసిన తీర్మానాన్ని ఆధారంగా తీసుకుందని పిటిషన్‌లో గుర్తుచేశారు. సర్కారియా కమిషన్ సైతం తన నివేదికలో ఇదే తరహా విషయాన్ని పేర్కొన్నట్లు వివరించారు. ఆంధ్రప్రదే‌శ్ విషయంలో కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు. కొత్తగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే అది ఆర్థికంగా నిలదొక్కుకుంటుందా, పాలన, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా సాగుతాయా అ‌నే అంశాలను ఒక స్వతంత్ర యంత్రాంగం పరిశీలించాలన్నారు. అంతే తప్ప రాజకీయ కారణాలతో నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబా‌ద్‌ నగరం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని, అనేక ప్రతిష్టాత్మక సంస్థలు అక్కడే ఏర్పాటయ్యాయని పిటిషన్‌లో సాల్వే వివరించారు. మిగతా రాష్ట్రం ముఖ్యంగా సీమాంధ్రలోని అనేక జిల్లాలు అభివృద్ధిలో బాగా వెనుకబడ్డాయని వివరించారు. రాష్ట్రాన్ని విభజిస్తే వ్యవసాయాధార ప్రాంతమైన  సీమాంధ్రలో రైతులతో పాటు, సామాన్యులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.

Back to Top