రాష్ట్రం ప్రైవేట్‌ సంస్థలకు తాకట్టు



– వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు
– చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను వంచిస్తున్నారు
 
హైదరాబాద్‌: రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రైవేట్‌ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌ను చైనాకు తాకట్టు పెట్టారని, అమరావతిని సింగపూర్‌కు తాకట్టు పెట్టారని, రాబోయే రోజుల్లో అనేక విద్యా సంస్థలను, పరిశోధన సంస్థలను ప్రైవేట్‌ సంస్థలకు తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  నాగిరెడ్డి మాట్లాడుతూ.. 2014లో చంద్రబాబు సీఎం కాగానే భారీగా ప్రాజెక్టుల అంచనాలు పెంచి వందల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఒక్క రోజు అధికారంలో ఉన్నా కూడా రైతులను, రాష్ట్రాన్ని తాకట్టుపెడతారని ఆయన విమర్శించారు. రైతులు ప్రాజెక్టులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణభారత ధాన్యగారంగా పేరున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చంద్రబాబు దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ప్రైవేట్‌ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. వ్యవసాయాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. బాబు పాలనలో సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను వంచించారని ఫైర్‌ అయ్యారు. అతితక్కువ సాగు జరిగింది ఈ ఏడాదే అని వివరించారు. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఒ క్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఇటీవల పోలవరం కాపర్‌ డ్యాంను జాతికి అంకితం చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి చర్యలు సిగ్గు చేటు అన్నారు. పునాదులకు నీరు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు కాపర్‌ డ్యాంను నిర్మిస్తారని, అలాంటి కార్యక్రమాన్ని కూడా జాతికి అంకితం చేస్తారా అని నిలదీశారు. నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి అయ్యిందా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలు ఉండేవన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో వ్యవసాయానికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండు చేశారు. 
 
Back to Top