చంద్రబాబు మోసాలను ఎండగడదాం

రాజమండ్రి:

చంద్రబాబు నాయుడి మోసాలను ఎండగడదామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘మోసాలతో ప్రజలను మాయచేసి అధికారం చేపడుతున్న చంద్రబాబు అసలు స్వరూపం మరో 15 రోజుల్లోనే ప్రజలకు తెలియబోతోంది. గతంలో మద్యపాన నిషేధం ఎత్తివేసిన సమయంలో చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచినట్టే.. ఇప్పుడు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 వంటి యెల్లో మీడియా సంస్థలు మళ్ళీ అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు మోసాలను బయటకు రానీయకుండా కంటికి రెప్పలా కాపాడనున్నాయి. బాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది. పార్టీని గ్రామస్థాయి వరకూ బలోపేతం చేద్దాం. కార్యకర్తలకు బాసటగా నిలుద్దాం. గ్రామ కమిటీలను పునరుజ్జీవింపజేసి టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఆ కమిటీల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్దాం. పోరాటాల ద్వారా ప్రజలకు అండగా నిలుద్దాం’ అంటూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇటీవలే ముగిసిన సాధారణ ఎన్నికలలో పార్టీ గెలుపు ఓటములపై రాజమండ్రి వేదికగా బుధవారం నుంచి శుక్రవారం వరకూ.. నిర్వహించిన తొలి విడత సమీక్షా సమావేశాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో 8 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 51 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు ఓటములపై శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్షించి నాయకులు, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. పేరుపేరునా కార్యకర్తలను పలకరిస్తూ వారిలో మనోధైర్యం నింపారు.

సమీక్షా సమావేశాల చివరి రోజు శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల్లోని అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఆచంట, పాలకొల్లు, ఉండి, నర్సాపురం అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులు, కార్యకర్తలతో శ్రీ జగన్ సమీక్షించారు.

తెల్లవారుజాము వరకూ సమీక్షలు‌ :

ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన సమయం కంటే ఎక్కువ వెచ్చించడంతో.. సమీక్షల షెడ్యూల్‌లో తీవ్ర జాప్యం జరిగింది. తొలి రోజు నుంచీ సమీక్షలు అర్ధరాత్రి దాటేవరకూ కొనసాగుతూనే వచ్చాయి. కార్యకర్తలు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా విన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి వారి సూచనలు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సమీక్షలు తెల్లవారు జామున ఐదు గంటల వరకూ సాగాయి. శుక్రవారం ఇదే తరహాలో అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం నాటి సమీక్షలో, గ్రామ కమిటీలు, మండల కమిటీలను పునర్వ్యవస్థీకరించి, నిత్యం ప్రజలతో మమేకమయ్యేలా చూడాలని పి.గన్నవరానికి చెందిన బంగారు నాయుడు శ్రీ జగన్‌కు సూచించారు.

వైఫల్యాలకు కారణాలను ఒకరిపై మరొకరు నెట్టుకోవడం మాని, ఇకనైనా నేతలు సమన్వయంతో పరస్పరం సాయపడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పెనుమంట్ర సర్పంచ్ దాట్ల రంగవతి సూచించారు. ‘ఓడినా మేమేమీ అధైర్యపడడం లేదు. మీరూ అధైర్యపడకండి. గెలుపు అవకాశం ఉన్న పార్టీగా వై‌యస్ఆర్‌సీపీని బలోపేతం చేద్దాం’ అని ఉండి కార్యకర్త అర్చారావు అన్నారు. ‘మీ కోసం నాలుగున్నరేళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. రానున్న ఐదేళ్లు కూడా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాం. అవసరమైతే ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నానని కుటుంబం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని ఆచంటకు చెందిన డాక్టర్ మునుబాబు అన్నప్పుడు ‌శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సమీక్ష సమావేశాల్లో నాయకులు, కార్యకర్తల మనోగతాలను తెలుసుకునేందుకే జననేత అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ విధివిధానాలపై నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

విశ్వసనీయతే మనకు ముఖ్యం:

నాయకులకు అధికారం కన్నా విశ్వసనీయత ముఖ్యమని, విలువలతో కూడిన రాజకీయాలు చేసినప్పుడే ప్రజలు మనలను ఆదరిస్తారని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సమీక్షల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలిచాం. రానున్న రోజుల్లో పదునైన వ్యూహాలతో పార్టీని గ్రామస్థాయి వరకూ బలోపేతం చేద్దాం. దేశంలో ఇప్పటివరకూ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు భిన్నంగా, బలమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడేందుకు నాయకులు, కార్యకర్తలు ఇప్పటినుంచే కార్యోన్ముఖులు కావాలి’ అని పిలుపునిచ్చారు.

‘అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ కూటమి.. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కన్నా కేవలం 5.60 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ తెచ్చుకుంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా రుణమాఫీ హామీతో చంద్రబాబు ప్రజలను నమ్మించగలిగారు. మరో 15 రోజుల్లో ఖరీ‌ఫ్ సీజ‌న్ ప్రారంభమవుతుంది.‌ రైతులు రుణాల కోసం బ్యాంకర్ల వద్దకు వెళ్తారు. పాత రుణాలు మాఫీ చేస్తేనే కానీ కొత్త రుణాలు ఇవ్వరు. అప్పుడు చంద్రబాబు మోసం బయటపడుతుంది. రైతులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు’ అన్నారు. ‘నేను కూడా రైతు రుణ మాఫీ హామీ ఇచ్చి ఉంటే మూడు నెలలు తిరక్కుండానే మీరంతా నా దగ్గరకు వచ్చి ఆచరణ సాధ్యం కాని హామీలు ఎందుకిచ్చావన్నా? గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నామన్నా.. అని అనేవారు. ఆ పరిస్థితి రాకూడదనే నేను ఆ హామీ ఇవ్వలేదు. నేను ముఖ్యమంత్రి కావాలనుకునే లక్ష్యం వెనుక ఒక బలమైన ఆశయం ఉంది. ఒకసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ల పాటు వరుసగా తిరిగి ఎన్నుకునేలా ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. ఓటమిపై దిగులు చెందాల్సిన పనిలే దు. ధైర్యంగా ఉండండి. భవిష్యత్ మనదే’ అంటూ‌ శ్రీ జగన్ కార్యకర్తల్లో మనోధైర్యం నింపారు.

Back to Top