జగన్ బెయి‌ల్ షరతులు సడలించిన కోర్టు

హైదరాబాద్, 30 అక్టోబర్ 2013:

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిలు షరతులను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సడలించింది. రాష్ట్రంలో పర్యటించేందుకు కోర్టు ఆయనకు బుధవారం అనుమతి మంజూరు చేసింది. అంతే కాకుండా ఆయన ఢిల్లీ వెళ్లేందుకు కూడా
 అనుమతిస్తూ సీబీఐ రెండవ అదనపు ప్రత్యేక కోర్టు జడ్జి ఎంవీ రమేశ్ బుధవారం తీర్పునిచ్చారు. హైదరాబాద్ విడిచి వెళ్లే రెండు రోజుల ముందు సీబీఐకి సమాచారం ‌తెలియజేయాలని, ఫో‌న్ నంబ‌ర్ ఇవ్వాలని, నగరం వెలుపల ఉన్న సమయంలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్‌లో అందుబాటులో ఉండాలని న్యాయమూర్తి షరతు విధించారు. ‘పార్లమెంట్ సభ్యునిగా ఆయన నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించవచ్చు’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు అనుమతివ్వండి :
ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తాను ప్రజల్లోకి వెళ్ళాలని, వారి కష్టాలు,
కడగండ్లు తెలుసుకోవడానికి రాష్ట్రంలో పర్యటించాలని అందుకు అనుమతి ఇవ్వాలని
శ్రీ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు పరిశీలించిన
కోర్టు ముందుగా విధించిన షరతులను సడలించింది. శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సుశీ‌ల్‌కుమార్ సీబీఐ కోర్టులో వాదనలు వినిపించారు. ‘రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ఉన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సి ఉంది. వారి బాధలు తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంది. సీఆర్‌పీసీ 437 (3) ప్రకారం సమంజసమైన కారణం (రీజనబుల్) అనిపిస్తే బెయిల్ షరతులను సడలించవచ్చు.‌ శ్రీ జగన్ తండ్రి దివంగత డాక్ట‌ర్ రాజశేఖరరెడ్డి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. సుదీర్ఘ కాలంగా వీరి కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ప్రజలతో మమేకమై ఉంది.‌ శ్రీ జగన్ జె‌డ్ కేటగిరీ భద్రత మధ్య ఉంటారు. 24 గంటలూ ఆయనకు రక్షణ ఉంటుంది. ఆయన కనిపించకుండాపోయే అవకాశం లేరు. కోర్టు విచారణకు క్రమం తప్పకుండా హాజరవుతారు’ అని సుశీ‌ల్‌కుమార్‌ కోర్టుకు తెలిపారు.

శ్రీ జగన్‌పై కేసులు నిర్ధారణ కాలేదు :

‌ఈ కేసులో సీబీఐ మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేసింది. దర్యాప్తును ప్రభావితం చేశారనే ఆరోపణగానీ, సాక్షులను బెదరించారని కానీ సీబీఐ ఎప్పుడూ చెప్పలేదు. శ్రీ జగన్‌పై సీబీఐ మోపిన అభియోగాలు విచారణ దశలోనే ఉన్నాయి. అవి ఇంకా నిరూపణ కాలేదు. కోర్టు విధించే షరతులను పాటించేందుకు శ్రీ జగన్ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బెయి‌ల్ షరతులు సడలించండి. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు, ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించండి’ అని సుశీ‌ల్‌కుమార్ వివరించారు. ఆయన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుని షరతులను సడలించింది.

‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ‌ శ్రీ జగన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నిరాహారదీక్ష కూడా చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ వైఖరిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీకి వెళ్లి జాతీయ పార్టీ నేతలను కలవాల్సి ఉంది. సాధారణ ఎన్నికలకు ఆరు నెలల గడువే ఉంది. ఈ తరుణంలో బలమైన రాజకీయ పార్టీ అధ్యక్షునిగా‌ శ్రీ జగన్ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి వి‌స్తృతంగా తీసుకెళ్లాల్సి ఉంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉందని సుశీల్‌కుమార్‌ కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతించడంతో శ్రీ జగన్ త్వరలోనే రాష్ట్రమంతటా పర్యటించే అవకాశం ఉంది.

Back to Top