హైదరాబాద్) నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన నిర్లక్ష్య పూరిత వైఖరి మీద ఆయన అభ్యంతరం తెలిపారు. దీనిపై ఆయన స్పష్టంగా ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు.ఎన్నికల సమయంలో ప్రతీ ఇంటికి కరపత్రాలు పంచారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రతీ ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని, లేదంటే రూ. 2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మ బలికారని చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు సంతకం పెట్టిన కరపత్రం అని ఆయన అన్నారు. ఇంట్లో పిల్లలు పెద్దగా చదువుకోకపోయినా ఫర్వాలేదు, ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పారని మండిపడ్డారు. ఇప్పుడు కోటీ 75 లక్షల ఇళ్లు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నాయని వివరించారు. ఉద్యోగాలు వస్తాయి, లేదా నిరుద్యోగ భృతి వస్తుందని ఆశపడుతున్నారని చెప్పారు.