విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మహిళలు అసహ్యించుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రోజాను మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరుకాకుండా అడ్డుకున్న తీరును ఆయన ఖండించారు. వెల్లంపల్లి ఏమన్నారంటే..ఈ రోజు మహిళా ప్రజాప్రతినిధి అయిన రోజాను దాదాపు గంటలకు పైగా ఎక్కడ నిర్భందించారో అంతుచిక్కడం లేదు. హిళా సదస్సుకు వెళ్లాలని తోటి ఎమ్మెల్యేలు, నగర కార్పొరేటర్లు రోజా కోసం ఎదురుచూస్తున్నారు. సదస్సులో రోజా పాల్గొనకుండా ఉండేందుకు గుండాల మాదిరిగా పోలీసులు కార్లలో మార్చుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది. రోజాకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని రోజా ఆచూకీ తెలపాలి. మీ ఆహ్వానం మేరకే ఆమె విజయవాడకు వచ్చారు. మహిళా సదస్సుకు వచ్చే అతిథులకు ఇలాంటి మర్యాదలేనా చేసేది. విదేశీ మహిళలను తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడిస్తున్నామన్నారు. ఇక్కడ స్వదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన మహిళా ప్రజాప్రతినిధులను మాట్లాడనివ్వకపోవడం దారుణం. మహిళలు ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. మళ్లీ ఇవాళ మహిళా సదస్సులో పాల్గొనకుండా అడ్డుకోవడం అన్యాయం. ఇప్పటికైనా చంద్రబాబు స్పందించి రోజాను సదస్సుకు తీసుకొని వచ్చి ఆమెతో మాట్లాడించాలి.