వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లోనే కొనసాగుతా: రేణుక

న్యూఢిల్లీ:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే తాను కొనసాగుతున్నానని, ఈ విషయంలో ఎలాంటి అయోమయానికి ఆస్కారం లేదని పార్టీ తరఫున కర్నూలు ఎంపీగా ఎన్నికైన బుట్టా రేణుక స్పష్టం చేశారు. నియోజవర్గం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే సీఎం చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశానని ఆమె వివరణ  ఇచ్చారు. ఢిల్లీలో మంగళవారం ఉదయం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కొత్తపల్లి గీతతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.

‘నాపై ఎలాంటి ఒత్తిళ్ళూ లేవు. నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. ఏమవుతుందో తెలుసుకునేలోపే అంతా జరిగింది. ఇదంతా అనుకోకుండా జరిగిన ఓ సంఘటన’ అని రేణుక తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలకు ఇక్కడితో ముగింపు పలుకుతున్నట్టు ఆమె చెప్పారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న మీ భర్త అందులోనే కొనసాగుతారా అని ప్రశ్నించగా.. ‘నాతో చర్చించకుండానే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో నేను పార్లమెంట్‌కి వెళ్లాను. ఆయన టీడీపీలో చేరినట్టు నాకూ మీడియా ద్వారానే తెలిసింది. అందుకే దాని గురించి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను’ అని తెలిపారు. రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరిగాయని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని రేణుక చెప్పారు.

ఎస్పీవై ఇకనైనా తప్పు తెలుసుకోవాలి: మేకపాటి
తన ప్రాంత అభివృద్ధి కోసం టీడీపీలో చేరానని చెబుతున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకోవాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి హితవు పలికారు. ఎస్పీవై రెడ్డిని టీడీపీ నాయకులు భ్రమపెట్టారో, భయపెట్టారో తెలియడం లేదన్నారు.

‘గత రెండు రోజులుగా చోటుచేసుకున్న సంఘటనలు ఎంతో దురదృష్టకరం. టీడీపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేంత మద్దతు ప్రజలు  ఇచ్చారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వాన్ని నడుపుతూ, చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. అది వదిలేసి ఇతర పార్టీల నాయకులను ప్రలోభ పెట్టడం అనైతికం. టీడీపీ నాయకులు ఇప్పటికైనా అలాంటి కార్యక్రమాలకు ముగింపు పలికితే మంచిది’ అని మేకపాటి చెప్పారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తారని ప్రజలంతా ఆశతో ఉన్నారని, చెప్పిన మాటను నిలబెట్టుకోకపోతే ప్రజలు ఆలోచిస్తారన్నారు.

వ్యవసాయ రుణాల మాఫీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మేకపాటి స్పందిస్తూ.. బాబు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా చేస్తుంటారని, రుణమాఫీ అమలు ఏవిధంగా చేస్తారో వేచి చూద్దామన్నారు. ఎస్పీవై రెడ్డి తిరిగి పార్టీలోకి వస్తే తీసుకుంటారా అని ప్రశ్నించగా.. ఆ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి బదులిచ్చారు.

Back to Top