న్యూఢిల్లీ: ప్రజలకు తాగునీరు కూడా అందించలేకపోతే ఇక ప్రభుత్వాల వల్ల ఉపయోగమేముందని వైయస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్రెడ్డి లోక్ సభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలందరికీ తాగునీటిని అందించడం మొట్టమొదటి ప్రాధాన్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో కరవు పరిస్థితులపై లోక్సభలో జరిగిన చర్చలో మేకపాటి మాట్లాడారు. ఏటా వేసవిలో తాగునీటి ఎద్దడి పరిస్థితి ఎదురవుతున్నందున శాశ్వత పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.<br/>దేశంలో పలు నదులున్నా నీరు అధికంగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో నదుల అనుసంధానానికి యోచించాల్సిన సమయం ఆసన్నమైందని.. వైఎస్ రాజశేఖరరెడ్డి గోదావరి, కృష్ణా నదులను కలిపేవిధంగా పోలవరం ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేశారు.