ఢిల్లీ దీక్షకు 'డీల్‌' ఎంత? చంద్రబాబూ

అనంతపురం :

‘ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీలో దీక్ష చేస్తావ్ చంద్రబాబూ? దీక్షతో ఏమి సాధిస్తావ్? దీక్ష చే‌యడానికి కాంగ్రెస్ అధిష్టానంతో ఎంత ప్యాకేజీకి డీ‌ల్ కుదిరింది? ప్రజలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల’ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, జిల్లా కన్వీనర్ మాలగుండ్ల శంకరనారాయణ డిమాండ్ చేశారు.‌

తెలంగాణ నోట్‌కు వ్యతిరేకంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి‌ 72 గంటల బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఆయన పిలుపు మేరకు చేపట్టిన బంద్‌లో భాగంగా మూడవ రోజు ఆదివారం వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అనంతపురంలోని తపోవనం సర్కిల్ వద్ద 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ.. శ్రీ వైయస్ జగ‌న్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై తెలుగుజాతిని ముక్కలు చేయడానికి పూనుకున్నాయని విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెర తీశారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలకు అన్నీ తెలిసినా ప్యాకేజీలు తీసుకుని నోరుమెదపడం లేదన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత మహానేత వైయస్ఆర్, ఎ‌న్‌టిఆర్‌ది అన్నారు.

రాష్ట్ర విభజన వల్ల కలిగే అనర్థాలు, అగచాట్లను దృష్టిలో పెట్టుకునే పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి రెండవ సారి ఆమరణ దీక్ష చేస్తున్నారని గురునాథరెడ్డి గుర్తు చేశారు. ఈ దీక్షకు అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు.

శంకరనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు సహకారంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ప్రజల మధ్య రాగద్వేషాలు పెంచుతోందని విమర్శించారు. అవినీతి చక్రవర్తిగా పేరొందిన చంద్రబాబు తన బండారం బయట‌ పడకుండా బహిరంగంగానే కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా ఎవరి కోసం, ఎందు కోసం ఢిల్లీలో దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‌పార్టీ నాయకుడు బి.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు జాతి సంస్కృతీ సంప్రదాయాలు ఇటలీ వనిత సోనియాకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.

Back to Top