విజయం మాదే శిల్పా మోహన్‌రెడ్డి

వైయస్‌ జగన్‌ మాదిరిగా బాబు కూడా నైతిక విలువలు పాటించాలి
మా తమ్ముడు ఎమ్మెల్సీ పదవి వదులుకోవడం గర్వకారణం
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలి
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 
నంద్యాల: ఉప ఎన్నికలో విజయం మాదే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా నంద్యాలలో టీడీపీ అనైతిక చర్యలకు పాల్పడిందని ఆయన ఖండించారు. ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరిగేందుకు సహకరించిన నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాదిరిగా చంద్రబాబు కూడా నైతిక విలువలు పాటించాలని ఆయన సలహా ఇచ్చారు.  పోలింగ్‌ అనంతరం శిల్పా మోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఉప ఎన్నికలో ప్రజా తీర్పు స్పష్టమైంది. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన ఓటర్లు ధర్మం వైపు నిలబడ్డారు.  నిన్న రాత్రి నుంచి చక్రపాణిరెడ్డిని అరెస్టు చేయాలని చూశారు. మేం ఒప్పుకోకపోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. మా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేందుకు టీడీపీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, అఖిల ప్రియ, టీజీ వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, ప్రభాకర్‌చౌదరి తదితరులు ఎన్నికల్లో విఘాతం కలిగించేందుకు, ఇబ్బందులు సృష్టించి ఎన్నికలు వాయిదా వేయించేందుకు ప్రయత్నించారు. మేం పోలీసులతో మాట్లాడాం. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలని కోరాం. మా తమ్ముడిని నేనే బయటకు రాకుండా చూశాను. భూమా మౌనికారెడ్డి మా ఏజెంట్‌ను బెదిరించి బయటకు పంపించారు. మున్సిపల్‌ æహైస్కూల్‌లో కూడా ఆమె చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, అతని అనుచరులు మా కౌన్సిలర్‌పై దాడి చేయడం, బెదిరించడం దారుణం. దౌర్జన్యాలు, మాటలు తగ్గడం లేదు. బ్రహ్మనందరెడ్డి మా కౌన్సిలర్‌ను బెదిరించారు. టీడీపీకి చెందిన వారిపట్ల కొందరు అధికారులు అనుకూలంగా వ్యవహరించారు. కొందరు పోలీసు అధికారులు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది బాగా పని చేశారు. కిందిస్థాయి అధికారులు మాత్రం మమ్మల్ని కొంత ఇబ్బందిపాలు చేశారు. చివరి నిమిషంలో గొడవలు సృష్టించడం బాధాకరం. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి సహకరించిన నంద్యాల నియోజకవర్గ ప్రజలకు, అ«ధికారులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 28 రోజులు మలేరియా జ్వరం వల్ల కొంత మందిని కలువలేకపోయాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని మనవి చేస్తున్నాను. తమ్ముడు చక్రపాణిరెడ్డి రాజకీయాల్లో నిజాయితీగా ఉండటానికి ఎమ్మెల్సీ పదవిని వదులుకొని రావడం గర్వకారణం. ఈ నైతిక విలువలు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాటిస్తున్నారు. ఇవే విలువలు చంద్రబాబు పాటిస్తే బాగుంటుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే బాగుంటుంది. 
 
Back to Top