వైయస్ఆర్ కాంగ్రెస్ జనసంతకం

హైదరాబాద్:

'జనం సంతకం' కార్యక్రమాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం సాయంతం ప్రారంభించింది. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కోటి సంతకాలను సేకరించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపనున్నారు. పార్టీ ఎస్టీ నేత రవీంద్రనాయక్ తొలి సంతకం చేశారు. జన సంతకం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుంచి ఈ లేఖపై సంతకాలు సేకరించనున్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా గర్హిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ కేసులను పెడుతోందని ఆరోపించారు. రెండు వందల రోజులకు పైగా శ్రీ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైలులో ఉంచారనీ, కక్షసాధింపు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకాన్ని కాపాడాలని కోరారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం చేస్తున్న విన్నపమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి, సోమయాజులు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, జనక్ ప్రసాద్, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గట్టు రామచంద్రరావు, మైనార్టీ విభాగం నేత రెహ్మాన్,  రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్దన్ రెడ్డి, వాసిరెడ్డి పద్మ, విజయారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top