<strong>ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ఆగ్రహం</strong><strong>భూములు లాగేసుకొని కనిపించకుండా పోయిన మంత్రులు</strong><strong>మోసం చేయడంపై తమ్ముళ్ల కన్నెర్ర</strong><br/>రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుపై సొంత పార్టీ నేతలే దుమ్మెత్తిపోస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో మంత్రులపై తిరగబడుతున్నారు.రాజధాని అమరావతి పేరుతో హడావుడి చేసి...భూములను లాగేసుకొన్న మంత్రులు ఇప్పుడు తమను పట్టించుకోకపోవడంతో రైతులతో పాటు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ప్రచారం చేసుకున్న మంత్రులు పత్తాలేకుండా పోవడంపై మండిపడుతున్నారు. అడపాదడపా కనబడిన మంత్రులను నిలదీస్తూ వారికి చుక్కలు చూపిస్తున్నారు. <br/>రాజధానికి భూములివ్వమంటే ఇచ్చాం... ఏడాదిన్నర దాటుతున్నా ఎక్కడ భూములిస్తారో చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. జాబిస్తామన్నారు, కనీసం ఉపాధి లేని పరిస్థితులు కల్పిస్తున్నారు అంటూ తమ్ముళ్లు నిలదీయడంతో మంత్రులు చేతగానితనంతో చేష్టలూడుతున్నారు. ఇటీవలే తుళ్లూరు పర్యటనకు వెళ్లిన మంత్రి పుల్లారావుకు టీడీపీ నేతల నుంచే చేదు అనుభవం ఎదురైంది. ఉద్యోగాలు, పింఛన్లు, ఉపాధి కార్యక్రమాలు కల్పిస్తామని ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించామని, ఇప్పుడు తమకు తమకు న్యాయం జరగడం లేదని మంత్రి పుల్లారావును కడిగిపారేశారు. పుల్లారావు డొంకతిరుగుడు సమాధానం ఇవ్వడంతో తుళ్లూరు టీడీపీ నేతలంతా ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. భూ సమీకరణ విషయంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి నారాయణకు నిరసనల సెగ పెరిగింది. జన చైతన్య యాత్రల్లో భాగంగా పర్యటిస్తున్న మంత్రి నారాయణను ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటూ నిలదీస్తున్నారు. నయా పైసా పెట్టుబడి లేకుండా భూములు సమీకరించినప్పుడు ఎన్నో హామీలిచ్చారు. అమలు విషయానికొచ్చే సరికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నారాయణపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. మంత్రి నారాయణ ఇచ్చిన వాగ్ధానాలకు ఆయన్ను గుర్రమెక్కించి గ్రామాల్లో తిప్పి అభిమానాన్ని చాటుకుంటే.. ఇప్పుడు మొండిచెయ్యి చూపుతున్నాడని నిప్పులు చెరుగుతున్నారు. భూ సమీకరణ పూర్తి చేసిన ఒక్కో గ్రామానికి రూ.30 లక్షలను ప్రభుత్వం నుంచి నజరానాగా ఇప్పిస్తానని చెప్పి మొహం చాటేశారని తమ్ముళ్లు ఫైరవుతున్నారు. భూ సమీకరణ కోసం నెలల తరబడి రాజధానిలో మకాం వేసిన నారాయణ అటువైపు వెళ్లాలంటేనే వణుకుతున్నారు. మరో మంత్రి రావెలకిషోర్ కు జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురైంది.