<strong>ఇరిగేషన్ శాఖలో వందల కోట్ల దోపిడీ</strong><strong>వాటాలు తేలక బయటపడ్డ అవినీతి బాగోతం</strong><strong>కాంట్రాక్ట్ లన్నీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్</strong><br/><br/>హైదరాబాద్ : వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం టీడీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇరిగేషన్ శాఖలో వందల కోట్ల దోపిడీ జరుగతోందని తమ్మినేని సీతారాం అన్నారు. ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును బర్తరఫ్ చేసి , కాంట్రాక్ట్ లన్నీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు ప్రాజెక్ట్ ల పేరుతో టీడీపీ నేతలు దొరికినకాడికి దోచుకుంటున్నారని తమ్మినేని మండిపడ్డారు. సాగునీటి శాఖలో జరిగిన అవకతవకలపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ ద్వారా బయటపెట్టాడన్నారు. ప్రభుత్వ అవినీతిని సొంత పార్టీ ఎంపీనే ప్రశ్నిస్తున్నారని, దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును నిలదీశారు. <br/><strong>దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు...</strong>అవినీతి దందాలో వాటాల లెక్కలు తేలక ..టీడీపీ నేతలు ఒకరి దోపిడీ మరొకరు బయట పెట్టుకుంటున్నారని తమ్మినేని సీతారాం విమర్శించారు. సాగునీటి శాఖలో జరిగిన దోపిడీపై విచారణ చేయించే ధైర్యం ఉందా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. టీడీపీ నేతల తప్పుడు పనులకు తలొగ్గని అధికారులను వేధిస్తూ...బలిపశువుల్ని చేస్తున్నారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచ్చలవిడి దోపిడీ చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న లూటీ గురించి తనకేం తెలియదంటూ మాట్లాడుతున్న దేవినికి...అలా మాట్లాడడం సిగ్గేయడం లేదా అని తమ్మినేని విరుచుకుపడ్డారు. <br/><strong>వాటా అయామ్ సేయింగ్...!</strong>గాలేరి నగరికి సంబంధించి 12 కోట్ల పనుల అంచనాలను... 110 కోట్ల రూపాయలకు పెంచేసి సీఎం రమేష్ సంస్థకు కట్టబెట్టారని చంద్రబాబుపై తమ్మినేని మండిపడ్డారు. నీటి ప్రాజెక్ట్ లు కడుతున్నామని చెప్పి అవినీతి ప్రాజెక్ట్ లు కడుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఎప్పుడూ వాట్ అయామ్ సేయింగ్ అని మాట్లాడతారని....వాటా అయామ్ సేయింగ్ అని అడుగుతున్నారన్న సంగతి బయటపడిందన్నారు. ఇరిగేషన్ శాఖలో పుంఖాను పుంఖాలుగా స్కాంలు జరుగుతున్నా చంద్రబాబు మంత్రికి అంటకాగుతున్నారని ధ్వజమెత్తారు. వెంటనే దేవినేనిని మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు.