జగన్‌ బాగా నీరసంగా ఉన్నారు: భారతి

హైదరాబాద్‌, 1 సెప్టెంబర్‌ 2013:

ఏడు రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయానికి బాగా నీరసంగా ఉన్నారని, ఆరోగ్యం కుదుటపడలేదని ఆయన సతీమణి శ్రీమతి వైయస్‌ భారతి తెలిపారు. శ్రీ జగన్‌ను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఆమె నిమ్సుకు చేరుకున్నారు. శ్రీ జగన్కు వైద్యులు పరీక్షలు నిర్వహించారని భారతి తెలిపారు. ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని చెప్పారు. శ్రీ జగన్‌ ఆరోగ్యం బాగా క్షీణించడంతో శనివారం మధ్యాహ్నం జైలు అధికారుల ఆదేశాలతో నిమ్సు వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్సు ఎక్కించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలన్న డిమాండ్ తో శ్రీ జగన్‌ చంచల్‌గూడ జైలులో ‌నిరవధిక నిరాహారదీక్ష చేశారు.

ఆస్పత్రిలో శ్రీ జగన్కు సాయంగా ఉండేందుకు శ్రీమతి భారతికి సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. నిమ్సు ఆసుపత్రిలో ఉన్నంతకాలం రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ జగన్‌తో ఉండేందుకు భారతిని అనుమతించాలని ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి యు. దుర్గాప్రసాద్‌రావు శనివారం చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అయితే వైద్యుల పర్యవేక్షణలోనే మందుల వాడకం, చికిత్స జరగాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Back to Top