స్పీకర్‌కు కృష్ణదాస్‌ ఫిర్యాదు

శ్రీకాకుళం, 31 ఆగస్టు 2012 : ఎమ్మెల్యే అయిన తనపై దౌర్జన్యానికి పాల్పడి గాయపరిచిన ఎస్‌ఐ నారీమణిపై చర్య తీసుకోవాలని కోరుతూ నర్సన్నపేట వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు పంపించారు. శాసససభ్యుల హక్కుల పరిరక్షణ కింద ఎ‌స్‌ఐ నారీమణిపై చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కృష్ణదాస్ కోరారు. డీజీపీ దినేష్‌రెడ్డికి కూడా ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కాగా, ఎమ్మెల్యే కృష్ణదాస్‌ తన విధుల నిర్వహణకు ఆటంకం కలిగించారంటూ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఎస్ఐ నారీమణి పోలీస్ స్టేషన్‌లో ‌ఫిర్యాదు చేయటం కొసమెరుపు.

తమ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, శ్రీకాకుళం జిల్లా పార్టీ కన్వీనర్‌ పద్మప్రియలపై దౌర్జన్యానికి పాల్పడిన గార ఎస్ఐ నారీమణిని వెంటనే సస్పెండ్‌ చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే కృష్ణదాస్‌పై ఎస్‌ఐ దౌర్జన్యం :

శ్రీకాకుళం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ పద్మప్రియ భర్త, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్

పోలీసు జీపులో ఉన్న పద్మప్రియను పలకరించబోతే ఎస్‌ఐ నారీమణి అడ్డుకున్నారు. తమ అదుపులో ఉన్న ఆమెతో మాట్లాడటానికి వీల్లేదని తూలనాడారు. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ సందర్భంగా కృష్ణదాస్‌పై నారీమణి దౌర్జన్యం చేయటంతో ఆయన చేతి వేలికి తీవ్ర గాయమైంది. నెత్తురోడుతున్న చేతితోనే ఆయన పద్మప్రియను తీసుకుని నేరుగా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. గతంలో నరసన్నపేట ఎస్‌ఐగా నారీమణి పనిచేసినప్పుడు ఆమె విధానాలపై ప్రశ్నించినందునే కక్షగట్టి ఇప్పుడు పద్మప్రియపై దౌర్జన్యం చేసినట్టు కలెక్టర్‌కు వివరించారు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై దౌర్జన్యం చేసి, గాయపరిచిన తీరును చెప్పారు. అనంతరం ఎస్‌పి వి.వి.గోపాలరావును కూడా కలిసి నారీమణిపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఎస్‌పీలతో మాట్లాడుతున్న సందర్భంలో ఆవేదనను నియంత్రించుకోలేక ఎమ్మెల్యే కృష్ణదాస్‌, పద్మప్రియ కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్‌పి ‌సూచన మేరకు నారీమణిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

అనంతరం పోలీసులు ఎమ్మెల్యే కృష్ణదాస్‌ను రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లి గాయానికి చికిత్స చేయించారు. పద్మప్రియ, కృష్ణదాస్‌లపై ఎస్ఐ నారీమణి దౌర్జన్యానికి నిరసనగా  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు శ్రీకాకుళం వైయస్‌ఆర్‌ సర్కిల్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. నారీమణిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ శారు. విషయం తెలుసుకున్న ఎస్‌పి ‌కె.వి.వి.గోపాలరావు ఎమ్మెల్యే కృష్ణదాతో ఫోన్లో మాట్లాడారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ధర్నా విరమించాలని కోరారు. దీంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ధర్నాను విరమించారు.

Back to Top