<strong>రాష్ట్రంలో కుంటుబడిన పాలన..</strong><strong>ప్రజాసమస్యలపై పోరాటం తీవ్రతరం..</strong><strong>విజయనగరంలో యువభేరికి సన్నాహాలు..</strong><br/>విజయనగరంః వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎయిర్ పోర్ట్, సీపోర్ట్, రాజధాని పేరుతో అన్యాయంగా భూములు లాక్కొంటూ చంద్రబాబు ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు. మైదాన ప్రాంతాలే గాకుండా కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్. రాజశేఖర్ రెడ్డి అనుమతిలిచ్చారంటూ చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు. గత ప్రభుత్వాల మీద నెపం వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. <br/>గిరిజన ప్రాంత ఆస్తులను దోచుకొని, సింగపూర్ , జపాన్ లకు అమ్ముకోవాలని చూస్తున్నారని వీరభద్రస్వామి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాడుతుందని ..తమ అధ్యక్షులు వైఎస్ జగన్ డిసెంబర్ 2న స్వయంగా పాల్గొని ఆదివాసీల పోరాటానికి తన మద్దతు తెలియజేస్తారన్నారు. చంద్రబాబు ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి అడియాశలు చేశాడని వీరభద్రస్వామి ఫైరయ్యారు. నిత్యవసర వస్తువుల ధరలు మండుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు.<br/>ప్రజాసమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు పార్టీని అట్టడగు స్థాయినుంచి పటిష్టం చేస్తున్నామని ,కేడర్ ను సంసిద్ధం చేస్తున్నామని వీరభద్రస్వామి పేర్కొన్నారు. త్వరలోనే విజయనగరంలో కూడా యువభేరి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వీరభద్రస్వామి తెలిపారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు జిల్లావ్యాప్తంగా ప్రతి మండలంలో పార్టీ నేతలందరితో సభలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు,యువకులు సహా అన్ని వర్గాల వారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని...వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తామని తెలిపారు. ఇప్పటికే మండల్ కమిటీ నియామకాలు చేశామని, వారికి నియామక పత్రాలు అందించి పూర్తి బాధ్యతలు అప్పగిస్తామన్నారు.