అవినీతిపై విచారణకు సిద్ధమా? చంద్రబాబూ


ఏలూరు:

తొమ్మిదేళ్ళ తన పరిపాలనలో ప్రజలకు కనీసం తినడానికి తిండి కూడా దొరకనివ్వని చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారికి అన్నీ చేసేస్తానంటూ పట్టపగలే పచ్చి పచ్చిగా అబద్ధాలు చెబుతున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నిప్పులు చెరిగారు. ఆయన చీకటి, భయానక పాలనలో తాను చేసిన స్కాములపై విచారణ జరగకుండా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుని బతుకుతూ ఎదుటివారిపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన ‘వైయస్ఆర్ జనభేరి’ సభల్లో చంద్రబాబు నాయుడి కల్లబొల్లి హామీలను శ్రీమతి విజయమ్మ తూర్పారపట్టారు.

చంద్రబాబు నాయుడు నిక్కర్లు వేసుకున్నప్పుడే హైదరాబాద్ నగరం దేశంలో మూడ‌వ స్థానంలో ఉందని శ్రీమతి విజయమ్మ అన్నారు. కానీ హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెబుతూ అందరినీ మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనంతా స్కాములమయం కాదా? ఆ స్కాముల కేసుల్లో నువ్వు స్టేలు తెచ్చుకుని బతకట్లేదా? ఆ కుంభకోణాలు, నీ అవినీతిపై విచారణకు సిద్ధమా చంద్రబాబూ? ఏలేరు కుంభకోణం, మద్యం, స్కాలర్‌షిప్‌ల కుంభకోణాలు, నకిలీ స్టాంపులు, నీరు-మీరు పథకం.. ఇలా ప్రతి దానిలో అవినీతికి పాల్పడిన ఘనుడివి నీవు. వేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని నీ బినామీలకు చెందిన ఐఎంజీకి అతి తక్కువ ధరకే కట్టబెట్టావు. 850 ఎకరాల భూమి అప్పట్లోనే రూ.1650 కోట్లు ఉంటే.. నేడు అది రూ.16 వేల కోట్ల విలువకు చేరింది. ఆ భూమిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ నీ ఇష్టారాజ్యంగా బినామీలకు ఇచ్చేశావు. నీ హయాంలో 54 ప్రభుత్వ కంపెనీలను నష్టాల్లోకి నెట్టేసి ఆ కంపెనీలను తెలుగు తమ్ముళ్ళకు అప్పజెప్పావు. ఆఖరికి ఆయా కంపెనీల్లో పనిచేసే 26 వేల మంది ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనుడవు నీవు' అని శ్రీమతి విజయమ్మ విమర్శించారు.

Back to Top