రైతుల రుణాలు రద్దు చేయాలి: విజయమ్మ

విజయవాడ, 27 అక్టోబర్ 2013:

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు సహజంగా ఇచ్చే పరిహారాన్ని ఎకరాకు రూ.10 వేల చొప్పున వెంటనే అందజేయాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇ‌న్‌పుట్ సబ్సిడీని‌ కూడా ఇవ్వాలన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు. తడిసిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేయించాలని విజ్ఞప్తిచేశారు. కౌలు రైతులు, పంట నష్టపోయిన రైతులకు బ్యాంకు రుణాలు రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలోని‌ వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఆమె వర్షాలకు తడిసిపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులు శ్రీమతి విజయమ్మ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధిత రైతులను శ్రీమతి విజయమ్మ పరామర్శించారు.

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి, కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ రాస్తానని శ్రీమతి విజయమ్మ వరద బాధితులకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి పంట నష్టపోయిన కృష్ణా జిల్లాలో ఆదివారం విజయమ్మ పర్యటించారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోని అనుమంచిపల్లి, షేర్‌మహ్మద్‌పేట, గౌరవరం, చిల్లకల్లు, ముండ్లపాడు, నవాబుపేట, రాఘవాపురంలలో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను ఆమె పరిశీలించారు. పూర్తిగా పాడైపోయిన పత్తి, మొక్కజొన్న, వరి, కాలిఫ్లవర్, మిరప పంటలను చూసి చలించిపోయారు. మహిళా కౌలు రైతులు కన్నీటి పర్యంతమవుతూ తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఈ సందర్భంగా రైతులతోను, పంటలను పరిశీలించిన తరువాత పెనుగంచిప్రోలు మండలంలోని ముండ్లపాడు క్రాస్‌రోడ్సు వద్ద మీడియాతోను, ఆ తరువాత చిల్లకల్లులో జరిగిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలోనూ శ్రీమతి విజయమ్మ మాట్లాడారు.

రైతులు వేలకు వేలు పెట్టుబడి పెట్టి వేసిన పంట అంతా సర్వనాశనం అయిపోయిందని, వారికి ఒక్కపైసా కూడా వచ్చే పరిస్థితి లేదని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టంపై తమ పార్టీ ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించి న్యాయం జరిగేలా కృషిచేస్తామన్నారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించి రైతులకు న్యాయం చేసేలా పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. అధికారులు పంటల నష్టంపై సరైన అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు.

మహానేత ఉంటే ఇలా పట్టనట్టు ఉండేవారు కాదు :
రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది మొద్దు ప్రభుత్వమని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇంత నష్టం జరిగినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాలు బయట పెట్టలేదని, కనీసం అధికారులు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే ఇలా పట్టనట్టుగా కూర్చునేవారు కాదన్నారు. రైతులు ఎకరానికి రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టి పత్తి, మిరప, మొక్కజొన్న, వరి, కాలిఫ్లవర్ వంటి పంటలు సాగుచేశారని‌ ఆమె తెలిపారు.

తుపాను కారణంగా పంట అంతా నాశనం అయిపోయిందని, నీలం తుపాను కంటే కూడా ఇప్పుడు ఎక్కువ నష్టం జరిగినట్లు కనిపిస్తోందని శ్రీమతి విజయమ్మ అన్నారు. జగన్‌బాబు అధికారంలోకి వచ్చాక అందరికీ మంచి రోజులు వస్తాయని శ్రీమతి విజయమ్మ భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమ ప్రభుత్వం వస్తుందని, కౌలుదార్లకు రుణాలు వచ్చేలా చేస్తారని చెప్పారు.‌ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వైయస్‌ఆర్ ఢిల్లీకి వెళ్లి నిధులు వచ్చేలా చేసేవారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం మాత్రం ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు.

శ్రీమతి విజయమ్మకు సమస్యలు వివరించేందుకు, పాడైపోయిన పంటలు చూపించేందుకు రైతులు ఆసక్తి చూపారు. చిల్లకల్లులో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలోనూ పలువురు రైతులు దెబ్బతిన్న పంటలను ఆమెకు చూపించి గోడు వెళ్లబోసుకున్నారు.

శ్రీమతి విజయమ్మ పర్యటనలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ తలశిల రఘురామ్, రైతు విభాగం రాష్ట్ర కన్వీన‌ర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, మహిళా విభాగం రాష్ట్ర కన్వీన‌ర్ కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని నాని, జోగి రమేష్, వంగవీటి రాధా, జ్యేష్ఠ రమే‌ష్‌బాబు, విజయవాడ సెంట్రల్ సమన్వయకర్త గౌత‌ంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top