షర్మిలకు ఆరువారాల్లో స్వస్థత: వైద్యులు

హైదరాబాద్:

మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న దివంగత మహానేత తనయ, వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిలకు ఆరు వారాల్లో స్వస్థత చేకూరుతుందని వైద్యులు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లాలో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తూ గాయపడిన ఆమెకు మంగళవారం అపోలో ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ నెల 14న ఎల్‌బీనగర్ సమీపంలోని బీఎన్ రెడ్డి నగర్‌లో బస్సుపై ఏర్పాటు చేసిన వేదిక నుంచి కిందికి దిగుతున్న క్రమంలో శ్రీమతి షర్మిల కుడి మోకాలికి బలమైన గాయమైంది. ఆ గాయాన్ని లెక్క చేయకుండా నాలుగు కిలోమీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించడంతో అది మరింత తీవ్రమై శస్త్రచికిత్స అత్యవసరమని తేలింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో అపోలో వైద్యులు శస్త్రచికిత్సను పూర్తి చేశారు. మోకాలిచిప్ప దిశను నిర్ణయించే కుడివైపు లిగమెంట్‌తో పాటు కార్టిలేజ్ (మృదులాస్థి) పాక్షికంగా దెబ్బతింది. వీటిని సరిచేయడానికి ఆర్థ్రోస్కోపీ(కీహోల్) సర్జరీ చేశారు. చికిత్స అరగంటలో పూర్తయిందని డాక్టర్ రఘువీర్ రెడ్డి చెప్పారు. ఆరు వారాల్లో ఆమె పూర్తిగా కోలుకుంటారని శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల తర్వాత వారానికో ఇంజెక్షన్ చొప్పున ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్(గాయపడిన వ్యక్తి నుంచి రక్తం తీసి, అందులోనుంచి ప్లాస్మాను వేరుచేసి ఇంజెక్షన్ ద్వారా మోకాలిలోకి చొప్పిం చడం) ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అన్నిటికంటే ఫిజియో థెరపీ ముఖ్యమని, దీనిద్వారా నిర్ణయించిన సమయానికంటే ముందే కోలుకునే అవకాశముందన్నారు. షర్మిలను బుధవారం డిశ్చార్జి చేసే అవకాశం ఉందన్నారు. శస్త్రచికిత్సలో అపోలో వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ శివభారత్‌రెడ్డి (డెక్కన్ ఆసుపత్రి)లతో పాటు అనస్థీషియన్ డాక్టర్ సనత్‌రెడ్డి పాల్గొన్నారు. చికిత్సకు ముందు శ్రీమతి షర్మిల చంచల్‌గుడా జైలుకు వెళ్ళి అన్న శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.

Back to Top