హైదరాబాద్ ) కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కి అకస్మాత్తుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మీద ప్రేమ పుట్టుకొని వచ్చింది. అందుకే అనంతపురం జిల్లా లో యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు దార్లు వెదుకుతున్నారు. రాష్ట్రాన్ని అడ్డ గోలుగా విభజించిన పాపం కాంగ్రెస్ కు దక్కుతుంది. మొట్ట మొదట గా రాష్ట్ర విభజన చేయాలని పదే పదే లేఖలు రాసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆసంగతి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ లో పర్యటించిన ప్రతీ సారి ప్రజలకు గుర్తు చేస్తుంటారు. అడ్డ గోలుగా రాష్ట్రాన్ని తెగ నరికిన కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ పర్యటన మీద సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబాన్ని అనేక రకాలుగా వేధించిన ఘనత పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి, దానికి నాయకత్వం వహిస్తున్న గాంధీలకు దక్కుతుంది. అంతే గాకుండా వైఎస్సార్ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి వేధించటం తెలుగు ప్రజలు, వైఎస్సార్ అభిమానులు మరిచిపోరు. ఒకానొక దశలో దివంగత మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును కూడా రాజకీయ కక్ష తో ఛార్జి షీటులో పెట్టించిన ఘనత కాంగ్రెస్ అగ్ర నాయకత్వానిదే. ఇప్పుడు మాత్రం ఏమీ ఎరగని మాదిరిగా రాష్ట్రంలో పర్యటించాలని, తెలుగు వారికి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయిక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కి మళ్లించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నికల కు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పాలనలో తెలుగుదేశం పార్టీ అందించిన అండదండలు అన్నీ ఇన్నీ కావు. ఆఖరికి విశ్వాస పరీక్షలో కూడ నిస్సిగ్గుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అరాచక రాజకీయం నడిపించారు. తర్వాత ఎన్నికలలో చంద్రబాబు అధికారంలోకి రావటానికి అన్ని రకాలుగా సహకరించారు.----------