'ప్రజల పక్షాన పోరాడుతున్నది వైయస్‌ఆర్‌సిపి'

నిర్మల్‌ (ఆదిలాబాద్‌ జిల్లా) : దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ‌ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల బాగోగులు పట్టించుకోకుండా పబ్బం గడుపుకుంటున్న ప్రభుత్వం, దానితో ప్రధాన ప్రతిపక్షం టిడిపి కుమ్మక్కయ్యాయని ఆయన దుయ్యబట్టారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఆశయాలన సాధనే ధ్యేయంగా‌ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన నిలబడి, సమస్యలపై పోరాటం చేస్తున్నదని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ సమక్షంలో మాజీ ఎంపి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నాయకులు, కార్యకర్తలు ఈ నెల 17న చేరనున్నారు. ఈ క్రమంలో నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ‌ స్టేడియంలో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు మహేందర్‌రెడ్డి శు క్రవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఐకే రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పోరాటం చేస్తున్నారని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
Back to Top