చంద్ర‌బాబు పర్యటనలతో వెలిగొండకు ప్రయోజనం శూన్యం

16 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రాజెక్టుకు తట్టెడు మట్టి కూడా తీయలేదు

వెలిగొండకు ప్రాణం పోసింది వైయస్‌ఆర్‌, పూర్తి చేసినది వైయస్ జగన్

నిర్వాసితులను మోసం చేస్తూ ప్రచార డ్రామాలు చేస్తున్న ప్రభుత్వం

ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వ‌జం 

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్‌

16 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ వెలిగొండ కోసం తట్టెడు మట్టి కూడా తీయలేదు.. ఇప్పుడు క్రెడిట్ కోసం పోటీ ప‌డుతోంది. 

వెలిగొండకు ప్రాణం పోసింది మహానేత వైయస్‌ఆర్‌, కీలక టన్నెల్ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసింది వైయస్ జగన్ ప్రభుత్వం. 

రూ.1000 కోట్లు ఇవ్వాల్సిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసి నిర్వాసితులను 
మోసం చేస్తున్నారు. 

7,350 కుటుంబాలకు పరిహారం పెండింగ్‌లో ఉండగా, మరో 2,500 కుటుంబాల భవితవ్యంపై ప్రభుత్వం నోరు 
మెదపడం లేదు. 

జూలైలో నీళ్లు ఇస్తామని చెప్పిన మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఏమైంది?

ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై చంద్రబాబు సవతి ప్రేమ చూపిస్తున్నారు.. 

అమరావతిలో జరుగుతున్న అవినీతి బయటపడుతుందనే భయంతో రైతుల సమస్యలను పరిశీలించేందుకు 
వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ బృందంపై టీడీపీ గూండాలను ఉసిగొల్పారు.

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు పర్యటనతో ఆ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, ఇది కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 16 ఏళ్లపాటు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి కూడా తీయలేదని, ఇప్పుడు ప్రాజెక్టుపై క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు నిజమైన ప్రాణం పోసింది మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారేనని, జలయజ్ఞం ద్వారా భారీగా నిధులు కేటాయించి పనులను పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. అనంతరం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక టన్నెల్ పనులను పూర్తి చేసి 2024లో ప్రాజెక్టును జాతికి అంకితం చేసిందన్నారు. వెలిగొండ చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకుని, నిర్వాసితుల సమస్యలు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ ఏమ‌న్నారంటే..

- 16 ఏళ్లలో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఖర్చు
వెలిగొండ ప్రాజెక్టు పర్యటనలో సీఎం చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఆయన పర్యటన ‘సిద్ధడు అద్దంకి వచ్చాడు, వెళ్లాడు’ అన్న సామెతలా మారింది. 1983లో ఎన్టీఆర్‌ వెలిగొండ గురించి ఆలోచించారని చెబుతున్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌, తన పాలనలో కలిపి 16 ఏళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్టుకు కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. అనుమతులు, డీపీఆర్‌లు, నిర్మాణ పనుల్లో ఏ ముందడుగు వేయలేదు. వెలిగొండకు నిజంగా ప్రాణం పోసింది మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారే. ఇప్పుడు ఇతరుల కష్టాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు క్రెడిట్‌ చోరీ రాజకీయాలు చేస్తున్నారు.

- వెలిగొండ పేరు చెబితే వైయ‌స్ఆర్ గుర్తొస్తారు
 2004లో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోశారు. 43.5 టీఎంసీల నీటి నిల్వ, మూడు జలాశయాల నిర్మాణం ద్వారా 15 లక్షల మందికి తాగునీరు, 4.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప ప్రణాళిక రూపొందించి రూ.8 వేల కోట్లు కేటాయించారు. అందులో రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి పనులు ముందుకు తీసుకెళ్లారు. అప్పటి వరకు శంకుస్థాపనలకే పరిమితమైన టీడీపీ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదు. అందుకే వెలిగొండ పేరు చెబితే ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది వైయస్‌ఆర్‌ గారే.

- 2024లోనే వైయ‌స్ జ‌గ‌న్ జాతికి అంకితం చేశారు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పాలనలో, అందులో రెండేళ్లు కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ, కీలక టన్నెల్ పనులు పూర్తి చేసి 2024లో వెలిగొండ తొలి టన్నెల్ ద్వారా నీటిని విడుదల చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 39 కిలోమీటర్ల రెండు టన్నెల్‌లలో చంద్రబాబు హయాంలో పూర్తయింది కేవలం నాలుగున్నర కిలోమీటర్లు మాత్రమే. ఈ ప్రాజెక్టుపై ప్రేమ ఉంటే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి రెండేళ్లలో కనీసం రూ.1000 కోట్లు ఇచ్చి ఉండాలి. కానీ రూ.900 కోట్లు ఇస్తామని ప్రకటించి కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 7,350 కుటుంబాలతో పాటు మరో 2,500 కుటుంబాలు ఆర్‌అండ్‌ఆర్‌ కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిర్వాసితులకు న్యాయం చేయకుండా వెలిగొండ పేరుతో డ్రామాలు చేయడం సరికాదు. చంద్రబాబు నోరు తెరిస్తే చాలు నాలుగోసారి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు. కానీ వెలిగొండ ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయని ఆయనకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. 

-  డ్రామాలు మానేసి నిధులు విడుదల చేయాలి
గత పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు జూలైలో నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? రెండేళ్లలో వెలిగొండకు ఎంత నిధులు కేటాయించారో ప్రజలకు చెప్పాలి. 2014–2019 మధ్య అధికారంలో ఉండి కూడా ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారు?. ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలపై చంద్రబాబు సవతి ప్రేమ చూపిస్తున్నారు. అందుకే వెలిగొండ విషయంలో ఇన్ని మోసాలు, ఇన్ని దగాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ చేయలేకపోయిన పనిని తానే చేస్తున్నానని చెప్పుకునే చంద్రబాబు, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం అవసరమైన అనుమతులు కూడా తీసుకురాలేకపోయారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మాత్రం ఐదు కాల్వలు, మూడు జలాశయాలు, మూడు ఆనకట్టలను నిర్మించి వెలిగొండకు రూపం ఇచ్చారు. ఇప్పుడు ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబును పశ్చిమ ప్రాంత టీడీపీ నాయకులే ప్రశ్నించాలి.

- రైతుల ముసుగులో టీడీపీ గూండాల దాడి
వైయ‌స్ఆర్‌సీపీని క్రిమినల్ పార్టీ అని విమర్శించే నైతిక హక్కు కూటమి ప్రభుత్వానికి లేదు. అమరావతిలో రైతుల సమస్యలను పరిశీలించేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ బృందంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. హోంమంత్రి అనిత పచ్చ అద్దాలు తీసి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. రైతుల ముసుగులో టీడీపీ శ్రేణులే ఈ దాడులకు పాల్పడ్డాయి.

వెలిగొండ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది. టీ-5 కాల్వ పనులు పూర్తి చేయకుండానే లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. అమరావతి, వెలిగొండ అంశాల్లో జరుగుతున్న అన్యాయాలను వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది" అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. 

Back to Top