తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న ప్రతీ కార్యక్రమంలోనూ అవినీతి తాండవం చేస్తోందని చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నారాయణ స్వామి ఆరోపించారు. కొత్త రాజధాని పేరుతో వేల ఎకరాల్ని రైతుల నుంచి బలవంతంగా లాక్కొన్నారని ఆయన విమర్శించారు. అందులో 25శాతం మేర రాజధానిని నిర్మించి, మిగిలిన భూముల్ని సింగపూర్ సంస్థలకు అప్పగించి, వేల కోట్ల రూపాయిలు దండుకొనేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆయన అన్నారు. గోదావరి పుష్కరాలకు వెచ్చించిన రూ.18 వందల కోట్ల రూపాయిల్లో అత్యధిక శాతం అవినీతికే ఖర్చయిందని ఆయన విమర్శించారు. ఇన్ని వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టినప్పటికీ, భక్తులకు కనీస వసతులు కల్పించటంలో విఫలం అయ్యారని ఆయన అన్నారు. చంద్రబాబుకి చిత్త శుద్ధి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సూచించారు.