ఐదో రోజుకు ఎంపీల దీక్ష

 
-క్షీణించిన వైయ‌స్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిల ఆరోగ్యం
- ఆరోగ్యాన్ని లెక్క చేయ‌కుండా దీక్ష కొన‌సాగిస్తున్న ఎంపీలు
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన కోసం వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగ‌ళ‌వారం ఐదో రోజుకు చేరుకుంది. ఎంపీలు వైయ‌స్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిల ఆరోగ్యం క్షీణించినా లెక్క చేయ‌కుండా దీక్ష కొన‌సాగిస్తున్నారు. షుగ‌ర్ లెవెల్స్ ప‌డిపోవ‌డంతో ఇవాళ ఉద‌యం డాక్ట‌ర్లు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించి దీక్ష విర‌మించాల‌ని సూచించారు. అయినా ఎంపీలు మొక్క‌వోని దీక్ష‌తో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని తెగేసి చెబుతున్నారు.  నాలుగో రోజు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.  ఆయన రక్తంలో చక్కెరస్థాయి పడిపోవడం, డీహైడ్రేషన్‌తో బాధపడుతుండడంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు సుబ్బారెడ్డిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వైయ‌స్‌ అవినాశ్‌రెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి ఏపీ భవన్‌లో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. నిన్న దీక్షా శిబిరంలో వైయ‌స్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ కూర్చొని ఎంపీలకు సంఘీభావం తెలిపారు. అలాగే జేడీయూ అధ్య‌క్షుడు శ‌ర‌త్‌యాద‌వ్ ఎంపీల దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఎంపీల దీక్ష‌కు మ‌ద్ద‌తుగా ఏపీలో రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు, రిలే నిరాహార‌దీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ఇవాళ ర‌హ‌దారుల దిగ్బంధం కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టారు.

Back to Top