మహానేత ఊపిరిపోస్తే.. కిరణ్ పాడె కట్టారు

తుమ్మిడిహెట్టి(ఆదిలాబాద్) 21 మే 2013

: జగన్ బాబు అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ చెప్పారు. కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రాంతాన్ని మంగళవారం మధ్యాహ్నం  ఆమె పరిశీలించారు. తుమ్మడి వద్ద భూమి పూజకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఏర్పాటుచేసిన పైలాన్కు ఆమె పాలాభిషేకం చేశారు. ఆ తరువాత అక్కడ మొక్కలు నాటారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాణహిత- చేవెళ్ల నిర్మిద్దాం..తెలంగాణను సస్యశ్యామలం చేద్దామని పిలుపునిచ్చారు.

ప్రాణహిత- చేవెళ్లకు నాడు మాహానేత డాక్టర్ వైయస్ఆర్ ఊపిరి పోస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పాడె కడుతోందన్నారు. తెలంగాణ గుక్కెడు నీటిని కిరణ్ సర్కారు లాగేసి గొంతును నులిపేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు నీటి సమస్య ఉందని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  చెప్పారన్నారు. తెలంగాణ ముక్కోటి రత్నాల వీణ అని ఆయన  చెప్పినట్లు తెలిపారు. ఆయన బతికి ఉంటే ఈ ప్రాంతం సస్యశ్యామలమై ఉండేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షా 56 వేల 800 ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. జగన్ బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు.

ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు సందర్శనకు శ్రీమతి విజయమ్మ హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరారు. హైదరాబాద్ నుంచి రైలులో  బయలుదేరిన ఆమె ఉదయం 11.15 గంటలకు కాగజ్‌నగర్ చేరుకున్నారు. కాగజ్నగర్ నుంచి రోడ్డు మార్గం గుండా కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి చేరుకున్నారు. శ్రీమతి విజయమ్మ వెంట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా సురేఖ, ఇంద్రకరణ్ రెడ్డి, బొడ జనార్దన్, కోనేరు కోనప్ప, జనక్ ప్రసాద్ ఉన్నారు.

Back to Top