హైదరాబాద్: కష్టాలుంటాయని తెలిసీ లెక్కచేయకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనీ, వారందరినీ అభినందిస్తున్నాననీ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ చెప్పారు. పశ్చిమగోదావరికి చెందిన సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు), ఎమ్మెల్యే తానేటి వనితతో సహా పెద్ద సంఖ్యలో నాయకులు పార్టీలో చేరిన సందర్భంగా ఆమె వారిని అభినందించారు. తనతో పాటు వచ్చే వారు మూడేళ్లకు పైగా కష్టాలు పడాల్సి ఉంటుందని వై.యస్.జగన్మోహన్ రెడ్డి నాడే చెప్పారనీ, వాటిని భరించక తప్పదనీ ఆమె తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చేలోగా ఎదురయ్యే అన్ని కష్టాలకూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఇబ్బందులుంటాయని తెలిసీ వస్తున్న వారు పార్టీ కోసం గట్టిగా పనిచేయాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి కోసం తపన పడ్డారని, జగన్ కూడా తండ్రిలాగే ప్రజల్లో ఉండే వారని గుర్తుచేశారు. జగన్బాబు అన్ని అడ్డంకులనూ అధిగమించి బయటకు వస్తారని.. ఆ దేవుడు చల్లగా చూస్తాడని, త్వరలో ఆయన ప్రజల మధ్య ఉంటారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తపరిచారు. నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులు, ప్రజలకు సంబంధిత ప్రాంతాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి మధ్యనే ఉండి ధైర్యం చెప్పాలనీ, చేయూత నివ్వాలనీ ఆమె కోరారు. వైయస్ స్వర్ణయుగం మళ్లీ తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అడ్హాక్ కమిటీ కన్వీనర్ టి.బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కొవ్వూరు, గోపాలపురం, దెందులూరు, తణుకు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. విజయమ్మ నేతలందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.జగన్ను సీఎం చేయడమే నా కర్తవ్యం: కృష్ణబాబుప్రస్తుతం తన ముందున్న కర్తవ్యం జగన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడమేనని, అందు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పార్టీలో చేరిన అనంతరం కృష్ణబాబు ప్రకటించారు. గతంలో టీడీపీలో ఎలాగైతే బాధ్యతలు తీసుకుని పనిచేశానో 2014 ఎన్నికల్లో కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ తరపున అలాగే కృషి చేస్తానని అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయింది. టీడీపీ పని 75 శాతం అయిపోయింది. ఎన్.టి.రామారావు టీడీపీని చాలా హుందాగా నడిపారు. చంద్రబాబు ఇపుడు దానిని ఎలా నడుపుతున్నారో అందరికీ తెలుసు. దాన్నొక కుల పార్టీగా, కుటుంబ పార్టీగా మార్చేశారు. ఇక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అశేష ప్రజాదరణ ఉంది. జగన్ ఈజ్ ఎ డైనమిక్ బాయ్, ఆయనకు ఎన్నో ప్రతిభా పాటవాలున్నాయి. ఆయనను ఎన్ని కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టినా అడ్డంకులను అధిగమించి బయటకు వచ్చి తీరతారు’ అని ఆయన అన్నారు. జగన్ బయటికి రాడని అంటే సోనియా అల్లుడు రాబర్టు వాద్రాతో సహా చాలా మంది నేతలు జైల్లోకి పోవాల్సిందేనన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 200 స్థానాలు వైయస్ఆర్ కాంగ్రెస్కు రావడం ఖాయమన్నారు. జగన్ నుంచి తానెలాంటి హామీ పొందలేదని, వచ్చే ఎన్నికల్లో ఏ పదవికీ పోటీ చేయబోనని పేర్కొన్నారు.బాబూ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను వేలం వేయండితాను చాలా కాలంగా కమ్మ సామాజిక వర్గం కోటాలో రాజ్యసభ సీటు ఇవ్వాలని బాబును కోరుతూ వస్తున్నానని.. కానీ, ఎపుడూ అవకాశం కల్పించలేదని కృష్ణబాబు అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి లేదని బాబుకు చెప్పి రాజ్యసభ కావాలని అడిగానని ఆయన హామీ కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాధ్యతలు తీసుకుని నాలుగింటిలో టీడీపీని గెలిపించానన్నారు.తీరా సుజనా చౌదరికి రాజ్యసభ సీటు ఇవ్వడం తనకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందన్నారు. సుజనా చౌదరి పార్టీ కోసం బాగా డబ్బు ఖర్చు చేశా రని, అందుకే ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చానని బాబు అప్పట్లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారని, దాంతో తాను ఆగ్రహం పట్టలేక నేరుగా ఆయన వద్దకు వెళ్లి ఈ విషయమై అడిగానన్నారు. ‘డబ్బులు ఖర్చు చేశారనే కారణంతో సుజనా చౌదరికి రాజ్యసభ టికెట్ ఇచ్చామని సమర్థించుకుంటే ఇక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులకు కూడా వేలం వేస్తే బాగుంటుంది కదా, పార్టీకి బాగా డబ్బులు వస్తాయి’ అని బాబుకు సలహా ఇచ్చానని గుర్తుచేశారు.