<br/><br/>చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోకి అడుగుపెట్టడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. తంబళ్లపల్లి మండలం ఎద్దులవారి కోట గ్రామం వద్ద పార్టీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. జననేత తమ జిల్లాకు రావడంతో పార్టీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ఆనందంతో గంతులు వేశారు. మన కష్టాలు తీరే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, మళ్లీ రాజన్న రాజ్యం జగనన్న తీసుకువస్తారని వారు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రతో టీడీపీలో వణుకు మొదలైందని తెలిపారు. కొట్టాల క్రాస్ వద్ద మహిళలు, రైతులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి సమస్యలు సావధానంగా విన్న జననేత మరో ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుందని, అందరికీ న్యాయం చేస్తానని భరోసా కల్పించారు.