చంద్రబాబు వ్యాఖ్యల వెనుక భవిష్యత్ కుట్ర

హైదరాబాద్:

సుమారు 11 ఏళ్ల క్రితం అలిపిరిలో తనపై జరిగిన బాంబు దాడి కేసు మకిలిని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డికి అంటగట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ఆ కేసును వైయస్ఆర్‌ పక్కదారి పట్టించారని మాట్లాడటాన్ని గట్టు తీవ్రంగా ఖండించారు. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో కానీ, ఆయన మరణించిన తర్వాత ఇద్దరు సీఎంలు మారినప్పుడు కాని చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ‌సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న చంద్రబాబు.. 11 ఏళ్ల తర్వాత అలిపిరి కేసును వైయస్‌ఆర్ పక్కదారి పట్టించారని చెప్పడం వెనక ఏదో కుట్ర దాగున్న‌దనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారంనాడు గట్టు మీడియాతో మాట్లాడారు.

‘2003లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చిత్తూరు జిల్లా అలిపిరి వద్ద నక్సల్సు దాడిలో గాయపడినప్పుడు సొంత కేబినెట్ సభ్యులు కూడా పరామర్శకు వెళ్లలేదు. వారంతా వేరే‌చోట సమావేశమై ఎవరు సీఎం కావాలంటూ చర్చించుకుంటున్న దశలో... రాజశేఖరరెడ్డి వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. అంతేకాదు దాడి జరిగిన ప్రదేశంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. దేవుడే చంద్రబాబును రక్షించారని చెప్పి ఆయన కంటనీరు పెట్టుకున్న విషయం గుర్తులేదా’ అని గట్టు ప్రశ్నించారు.

అలాంటి వైయస్ఆర్ మీద అభాండాలు వేయడం చంద్రబాబు నైజాన్ని తెలియజేస్తోంద‌ని గట్టు రామచంద్రరావు అన్నారు. ‘వైయస్ఆర్ సీఎం అయ్యాక గంగిరెడ్డి విషయంలో కాని, కాల్పుల ఘటనలో బాలకృష్ణ విషయంలో గానీ ఎక్కడా ఉపేక్షించారని మేము నమ్మడంలేదు.‌ చట్టాన్ని రాజశేఖరరెడ్డి ఎప్పుడూ గౌరవించేవారు. చట్టం ముందు అందరూ సమానమేనని నమ్మిన వ్యక్తి వైయస్ఆర్. ఎవరి మీద పగతీర్చుకోవాలనో, అధికారాన్ని ఉపయోగించో, కుట్రలు పన్నో ఎదుటి వారిని ఎదుర్కోవాలనే లక్షణం వైయస్‌ది కాదు’ అని అన్నారు.

దరిద్రపు అవలక్షణాలన్నీ చంద్రబాబుకు ఉండబట్టే 11 ఏళ్ల తర్వాత అలిపిరి ఘటనను చర్చకు తీసుకొస్తున్నారని, రాబోయే కాలంలో జరగబోయే కుట్రకు చంద్రబాబు సంకేతమిచ్చినట్లుగా అర్థమవుతోందని గట్టు అన్నారు.

తాజా వీడియోలు

Back to Top