అబద్ధాల పునాదుల మీద టీడీపీ మనుగడ

హైదరాబాద్, 21 అక్టోబర్ 2013: ‌

అబద్ధాల పునాదుల మీదే తెలుగుదేశం పార్టీ మనుగడ కొనసాగిస్తోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు నిప్పులు చెరిగారు. ప్రజల అభిమానం ఏమాత్రం పొందే అవకాశం లేని టీడీపీ ఇతర పార్టీలపై బురదచల్లే కార్యక్రమం పెట్టుకుందని విమర్శించారు. గోబెల్సు ప్రచారం చేయడంలో ఆరితేరిన చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకొని ఆ పార్టీ నాయకులు పయ్యావుల కేశవ్, రేవంత్‌రెడ్డి లాంటి వారు అనునిత్యం అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆదివారం గట్టు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం కొనసాగడానికి ముఖ్య కారణం చంద్రబా‌బు నాయుడే అని ఆయన స్పష్టం చేశారు.

ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసి‌ మరీ కాపాడారని గుర్తుచేశారు. తద్వారా రాష్ట్ర ప్రజల పాలిట గుదిబండలా తయారు చేశారన్నా రు. ఎఫ్‌డీఐలపై పార్లమెంటులో ఓటింగ్ స‌మయంలో కాంగ్రెస్‌కు సహకరించిన ముగ్గురు టీడీపీ ఎంపీలపై ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోని వైనాన్ని గట్టు గుర్తుచేశారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్, టీడీపీ రెండూ కలిసి పనిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు టీడీపీని కాంగ్రెస్ పార్టీకి బ్రాంచి ఆఫీసుగా మార్చారన్నారు.‌

పయ్యావుల కేశవ్ వ్యాఖ్య‌లను మీడియా ప్రస్తావించినప్పుడు.. గట్టు రామచంద్రరావు స్పందిస్తూ.. రాష్ట్ర విభజనపై టీడీపీ వైఖరేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో చంద్రబాబు చేసిన దీక్ష విభజన కోసమా? సమైక్యం కోసమా? అనేది‌ స్పష్టంగా చెప్పాలన్నారు. టీడీపీ నాయకులు పయ్యావుల, ఎర్రబెల్లి ఇద్దరూ ఒకేమాట చెప్పగలరా? అని గట్టు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు.

Back to Top