<strong>ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం</strong><strong>అధికారులను తిట్టడమే చంద్రబాబు పని</strong><strong>బాధితుల బాధలు కన్పించడంలేదా చంద్రబాబు</strong><br/>నెల్లూరుః కుండపోత వర్షాలకు ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడితే, చంద్రబాబు వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మండిపడ్డారు. గ్రామాలకు గ్రామాలు నీటిలో మునిగిపోయాయని, ఎక్కడ కూడా వారికి సాయం అందడం లేదన్నారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికీ అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయన్నారు. పనులు లేని పరిస్థితుల్లో బాధితులు ఉన్నారని, ప్రతి ఇంటికీ కనీసం 4,5 వేల రూపాయలైనా ఇవ్వకపోతే వాళ్లు ఎలా బతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.<br/>వైఎస్ జగన్ రెండో రోజు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. వాకాడు, వెంకన్నపాలెం తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలు, ఇళ్లు పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈసందర్భంగా బాధితులు వైఎస్ జగన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతి ఒక్కరిదీ ఒకటే ఆవేదన. తినడానికి తిండిలేక..సాయం కోసం ఆర్తనాదాలు పెడుతున్న తీరు అద్దం పట్టింది. ఇంతటి దారుణ పరిస్థితులు ఉన్నా ప్రభుత్వ పెద్దలకు వారి బాధలు పట్టకపోవడం దురదృష్టకరం. <br/>ఏ ఒక్క అధికారి కూడా వరద ప్రాంతాల్లో పర్యటించడం లేదని వైఎస్ జగన్ అన్నారు. ఎక్కడో ఓ చోట ఒకటో అరో రాసుకొని వెళుతున్నారు తప్పితే...బాధితులకు ఇంతవరకు ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. చంద్రబాబు నిధులివ్వకుండా అధికారులను పనిచేయమంటే వాళ్లు ఎలా చేస్తారని ప్రశ్నించారు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. చంద్రబాబు మోసం చేస్తూ ఆనెపాన్ని అధికారుల మీదకు నెడుతున్నారని విమర్శించారు. చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లా, ఈస్ట్, వెస్ట్ అంతట లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని, పంటలు మొలకలు వచ్చి పండిన ధాన్యం అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చేపల చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇన్ పుట్ చెల్లించే విషయంలోనూ చంద్రబాబు మోసం చేశాడన్నారు. వరదలు వచ్చాక కరువు మండలాలు ప్రకటించిన ఏకైక సీఎం చంద్రబాబేనని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.