<strong>సొంత వ్యాపారాల కోసమే బాబు విదేశీ పర్యటనలు</strong><strong>కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్నాడు</strong><strong>ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి</strong><strong>వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ</strong>విజయవాడః చంద్రబాబు మోసపూరిత పాలన సాగిస్తున్నాడని వైయ్ససార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సొంత వ్యాపారాలు చక్కబెట్టుకునేందుకే బాబు పెట్టుబడుల సాకుతో విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుబారా చేస్తూ చార్టర్డ్ ఫ్లైట్ లో తిరగడం ఎంతవరకు సమంజసమని బాబును ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు. ఓ పక్క జీతాలు, పెన్షన్లకు డబ్బులు లేవంటూ మరో పక్క ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలి చార్టర్డ్ ఫ్లైట్ లో షికార్లు చేస్తున్నాడంటూ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ప్రమాణస్వీకారం చేసిన దగ్గర్నుంచి జపాన్, చైనా, అమెరికా, సింగపూర్, మలేషియా, కోలంబో అంటూ దేశాలన్నీ తిరుగుతున్నారే తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఎన్ని పెట్టుబడులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. విదేశాలకు వెళుతున్నప్పడు ఎరైనా అక్కడి వారితో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసుకొని వెళతారని, కానీ అలా కాకుండా బాబు తన టీంతో కలిసి అక్కడున్న తెలుగు వాళ్లతో మీటింగ్స్ పెడుతున్నాడన్నారు. చంద్రబాబు తన ఆర్భాటం కోసం రాష్ట్రం పరువు తీస్తున్నాడని బొత్స ఫైర్ అయ్యారు. <br/>చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోవడం వల్లే పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ని వదిలి అమరావతికి వచ్చాడన్నారు. హైదరాబాద్ చంద్రబాబు, మంత్రులు టీఆర్ఎస్ సర్కార్ తో లోపాయికారి ఒప్పందం చేసుకొని...అక్కడ కోట్లాది రూపాయలు కాంట్రాక్ట్ లు తీసుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఏమీ తెలియని నంగనాచిలాగా ఇక్కడకు వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఆర్థికమంత్రి యనమలకు కేసీఆర్ రూ.2వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చాడని, మరో ఇద్దరు వ్యక్తుల మద్యం వ్యాపారనికి లైసెన్స్ ఇచ్చారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు చంద్రబాబు, మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. మీరు అక్కడ వ్యాపార సంబంధాలు పెట్టుకోవచ్చు, సామాన్యుడు మాత్రం బతకకూడదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని బొత్స దుయ్యబట్టారు. పోలవరంపై జిల్లాకు సంబంధిచిన మంత్రి రోజుకో మాట మాట్లాడుతూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పోలవరం వస్తే తప్ప మనుగడ ఉండదని దాన్ని ప్రారంభించి కాలువలు తవ్వించిన ఘనత వైయస్ఆర్ దన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ చేస్తున్న అవినీతి వల్లే పోలవరం ముందుకెళ్లలేదని అన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తే బాగుంటుందని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని బొత్స అన్నారు. దీనికి కేంద్రమే బాధ్యత వహించి ఉంటే బాగుండేదని తాము అంటే....వీరికి పోలవరం ఇష్టం లేదంటూ బాబు తమపై అబాండాలు వేశారని బొత్స గుర్తు చేశారు. <br/>