భయంతోనే బాబు పిటిషన్

మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ గొంతు చంద్రబాబుదే
బాబు తప్పు చేసినందునే విచారణ ఎదుర్కోవడం లేదు
దోషిగా తేలుతాడన్న భయంతోనే హైకోర్టులో పిటిషన్
వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో దోషిగా తేలుతాడన్న భయంతోనే చంద్రబాబు విచారణను ఎదుర్కోవడానికి భయపడుతున్నారని వైయస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. చంద్రబాబు కథ అయిపోయిందని ఆర్కే అన్నారు. న్యాయస్థానాలపై చంద్రబాబుకు గౌరవమే లేదని దుయ్యబట్టారు. అన్ని సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టాక సాక్ష్యాలు చెల్లవని టీడీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. మనవాళ్లు బ్రీఫ్ డ్ అని మాట్లాడిన గొంతు బాబుదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ లు కూడా తేల్చాయని చెప్పారు. 

ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఇప్పటికే ఆదేశించిందని, అందువల్ల కోర్టు ఉత్తర్వుల ప్రకారం విచారణ జరగాలని  (ఆర్కే) అన్నారు. తనపై కేసు కొట్టేయాలంటూ  చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. సీఆర్‌పీసీ 156 (3) కింద విచారణ జరిగితే చంద్రబాబు దోషా.. నిర్దోషా అన్న విషయం తేలిపోతుందని ఆయన చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రను తేల్చేందుకు, ఆయనను దోషిగా చేర్చాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆర్కేనే.

''విచారణ అర్హత ఉందని ఏసీబీ కోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. నిజంగా చట్టాల మీద, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటే, అప్పీలుకు వెళ్లొద్దని స్పష్టంగా అడిగాను. విచారణ ఎదుర్కోడానికి మీకు ఎందుకు భయం.. దోషి అన్న విషయం మీకే తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారా? ఈ రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా గడుపుతూనే ఉన్న మీరు.. ఈరోజు ఎందుకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ రెండు రోజుల్లో భయం లేనట్లు నటిస్తూనే బాబు గవర్నర్ వద్దకు ఎవరెవర్ని పంపారో ప్రపంచం మొత్తం చూస్తోందని ఆర్కే తెలిపారు. 

చట్టంలో ఉన్న చుట్టాలు కూడా ఎవరూ రక్షించలేరని తెలియడం వల్లే, ఈ కేసులో తన పాత్ర బయట పడుతుందన్న భయంతోనే బాబు క్వాష్ పిటిషన్ వేశారన్నారు. గతంలో చాలామంది మహామహులు సీఆర్‌పీసీ 156 (3) కింద విచారణను ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. జయలలిత, జస్వంత్ సింగ్, కేంద్రమంత్రులు అందరూ ఇదే సెక్షన్, క్లాజు కింద విచారణ ఎదుర్కొన్నారన్నారు. అసలు విచారణ ఎదుర్కోకుండానే కేసు నుంచి తప్పించుకోవాలని  కోరడమేంటని ప్రశ్నించారు.  దాన్ని బట్టే బాబు ఎంత తప్పు చేశారో తెలిసిపోతోందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వాళ్లు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఆర్కే స్పష్టం చేశారు. 
Back to Top