విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే భయమని పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అందుకే టీడీపీ మహానాడులో చంద్రబాబు వైఎస్ జగన్ జపం చేశారని విమర్శించారు. విజయవాడ పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. <br/>ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నయవంచనకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. జూన్ 2న రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయనున్నట్టు చెప్పారు. వైఎస్ఆర్ సీపీని, వైఎస్ జగన్ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని విమర్శించారు. మహానాడులో 212 సార్లు దివంగత మహానేత వైఎస్ఆర్ను, 507 సార్లు వైఎస్ జగన్ను తలచుకున్నారని, ఎన్టీఆర్ను కేవలం 83 సార్లే గుర్తుచేసుకున్నారని చెప్పారు.