విశాఖపట్నం) ప్రభుత్వం మరోసారి కుటిల బుద్దిని బయట పెట్టుకొంది. ప్రత్యేక రైల్వే జోన్ కోసం విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చేస్తున్న దీక్షని భగ్నం చేసేందుకు పోలీసులతో ప్రయత్నించింది. బలవంతంగా ఆస్పత్రిలో చేర్పించింది. వైద్యానికి నిరాకరించిన అమర్ నాథ్ ఆసుపత్రిలో అయినా దీక్షను కొనసాగిస్తానని పట్టుబడుతున్నారు.ఆదివారం పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు దీక్ష శిబిరానికి తరలి వచ్చారు. ఈ నెల 20న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అక్కడకు వస్తారన్న సమాచారం అందరినీ ఉత్సాహ పరిచింది. రాత్రి పదిగంటలకు అంతా విశ్రమించేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారు. ఒక్కసారిగా వందలాది మంది మఫ్టీలో, యూనిఫాంలోనూ ఉన్న పోలీసులు వచ్చి చుట్టుముట్టారు. అక్కడున్నవారు తేరుకునే లోపే క్షణాల్లో అమర్నాథ్ను దారుణంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. రోడ్డుపై సిద్ధంగా ఉంచిన అంబులెన్స్లోకి ఎత్తి పడేశారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ కింగ్జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)కి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐఆర్సీయూ విభాగంలో ఉంచారు. ప్రభుత్వ చర్యలను ఉత్తరాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేక రైల్వే జోన్ మీద ఒక్క ప్రకటన చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.