నరసన్నపేట : రాష్ట్ర అభివృద్ధికి భారీ ఆర్థిక భారం మోపే అమరావతి నమూనా కంటే, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) కారిడార్ రాష్ట్రానికి శాశ్వత పరిష్కారమని వైయస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అంశంపై నరసన్నపేటలో శుక్రవారం చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న అమరావతి ప్రాజెక్టు ప్రజల సొమ్మును వృథా చేయడానికే తప్ప రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉపయోగపడదని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయలను అమరావతిలో వెచ్చించడం వల్ల రాష్ట్రంపై కోలుకోలేని ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కారిడార్ను రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేస్తే కేవలం రూ.20 వేల కోట్ల వ్యయంతోనే అత్యాధునిక మౌలిక వసతులు కల్పించవచ్చని గుర్తు చేశారు. ఇప్పటికే మచిలీపట్నం పోర్టు, గన్నవరం విమానాశ్రయం, జాతీయ రహదారులు, కృష్ణా నది జలాలు వంటి సహజ వనరులు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడం మరింత సులభమని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధికి మావిగన్ నమూనానే ఉత్తమ మార్గమని, ‘అమరావతి వర్సెస్ మావిగన్’ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధి సాధించాలంటే వైయస్ జగన్ ప్రతిపాదించిన దిశలోనే ప్రభుత్వం ఆలోచించాలని ఆయన సూచించారు.