తాడేపల్లి: త్వరలో జయహో ముస్లిం సభ నిర్వహిస్తామని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటి సిఎం అంజాద్ బాషా తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముస్లింల సంక్షేమం, వారి అభివృద్దికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటి సిఎం అంజాద్ బాషా, పార్టీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, శాసనమండలి సభ్యులు ఇక్భాల్, ఇషాక్ బాషా, రుహుల్లా, ముస్లిం ఎఫైర్స్, సంక్షేమం సలహాదారులు ఎస్ ఎం జియాఉధ్దీన్, హబీబుల్లాలతోపాటు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఖాదర్ భాషా,పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీల అభివృద్ధికి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు.అదే బాటలో వైయస్ జగన్ కూడా ముస్లిం మైనారిటీల రాజకీయ, సామాజిక, ఆర్దిక అభివృద్ధికి దోహదం చేసే అనేక పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారన్నారు. ముస్లిం సోదరులు కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైయస్ జగన్ లపై ఎనలేని ఆప్యాయత, ప్రేమ కనబరుస్తున్నారని అన్నారు. వైయస్ జగన్ ముస్లిం కుటుంబాలను అభివృద్ది పధంలోకి తీసుకువచ్చేందుకు నిత్యం కృషి చేస్తున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వంలో లేనివిధంగా ముస్లిం మైనారిటీల అభివృద్ధి కోసం 20 వేల కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా, ఆ మొత్తాలను నేరుగా వారి అకౌంట్లలోకి వేయడం జరిగిందన్నారు. అదే విధంగా నలుగురికి ఎంఎల్ఏ లుగా అవకాశం కల్పించారని వారిలో తనను డిప్యూటి సిఎంగా చేశారన్నారు. శాసనమండలిలో నలుగురు ముస్లిం మైనారిటీలకు అవకాశం కల్పించారన్నారు. శాసనమండలి వైస్ ఛైర్మన్ గా ముస్లిం మహిళ జకియా ఖానుమ్ ను నియమించారన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఒకరికి, ఇద్దర్ని మేయర్లుగా , 11 మందిని మున్సిపల్ ఛైర్మన్లుగా శ్రీ వైయస్ జగన్ నియమించారన్నారు. ఇంకా జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, ఎంపిపిలుగా వందలాది మంది ముస్లిం మైనారిటీలకు అవకాశం కల్పించిన ఘనత వైయస్ జగన్ దేనని అన్నారు. జనరల్ కోటాలో సైతం ఆరుగురికి ఛైర్మన్ పదవులు ముస్లిం మైనారిటీలకే ఇచ్చారు. ఇంకా నామినేటెడ్ పదవులలోను, పార్టీ పదవులలోను ముస్లిం మైనారిటీలకు అవకాశం కల్పించారని వివరించారు. గడిచిన మూడున్నరేళ్లుగా మైనారిటీలకు సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేశారన్నారు. గతంలో ఎవరూ చేయని రీతిలోసంక్షేమ పథకాలను తెచ్చారని వివరించారు. చంద్రబాబు మైనారిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే, తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి గారి బాటలో ఆయన తనయుడు వైయస్ జగన్ గారు నడుస్తూ ముస్లింలను అక్కున చేర్చుకున్నారని తెలియచేశారు. మైనారిటీల సంక్షేమం కోసం వైయస్ జగన్ గారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. వీటికి సంబంధించి అమలు చేస్తున్న పథకాలను, వాటి ద్వారా ముస్లిం మైనారిటీలకు కలుగుతున్న ప్రయోజనాలను గురించి క్షేత్రస్థాయిలో వివరించబోతున్నామని తెలిపారు. వైయస్ జగన్ ముస్లిం మైనారిటీల పక్షపాతిగా ఉన్నారని తెలిపారు. త్వరలో విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ఒక ముస్లిం మైనారిటీ సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు. అదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముస్లిం మైనారిటీల సమావేశాలను కూడా నిర్వహిస్తామని తెలియచేశారు. త్వరలో జయహో ముస్లిం సభను నిర్వహిస్తున్నట్లు వివరించారు.