కుప్పం: సోషల్ మీడియా పోస్టు కేసులో పోలీసులు తనపై మోపిన అభియోగాలకూ, తనకూ ఎలాంటి సంబంధం లేదని, తాను పోస్టు తయారు చేయడం కానీ, పోస్టు చేయడం కానీ, ఫార్వార్డ్ చేయడం కానీ చేయలేదని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి స్పష్టం చేశారు. ఇవాళ కుప్పం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పాతికేళ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేసిన తాను ఎప్పుడూ చట్ట పరిధిలోనే పనిచేశానని, ఇకపైనా అలాగే పనిచేస్తానని పూడి శ్రీహరి తెలిపారు. చట్ట పరిధిలోనే పనిచేస్తా, వ్యక్తిత్వ హననం చేయొద్దు: వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి రాష్ట్రంలో కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా నా వ్యక్తిత్వ హననం చేసే ప్రక్రియ జరుగుతున్నందున ఓ క్లారిటీ ఇవ్వదల్చుకున్నాను. నా మీద మోపిన అభియోగాలకూ, నాకూ ఎలాంటి సంబంధం లేదు. దాదాపు 26 ఏళ్లుగా సీనియర్ జర్నలిస్టుగా ఉన్నాను. వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో చాలా మంది పెద్దలతో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. వివిధ పత్రికలు, ఛానళ్లలో ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టుల తరహానే పాత్రికేయ పరిధికి లోబడే నేను పనిచేస్తాను తప్ప పరిధి దాటి ఎప్పుడూ పని చేయలేదు. నా మీద ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేదు. ఈ మధ్య కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి పోలీసులు అడిగిన వివరణ ఇచ్చాను. ఇవాళ కూడా ఈ కేసుకు సంబంధించి వివరాలు అడిగితే చెప్పాను. పోలీసులు అడిగిన సమాచారం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలియజేశాను. నేను అభియోగాలు ఎదుర్కొంటున్న పోస్టింగ్ తయారీలో కానీ, దాన్ని ఇతరులకు పంపించడంలో కానీ, నేను పోస్ట్ చేయడం కానీ చేయలేదు. ఎప్పుడూ జర్నలిస్ట్ పరిధిలోనే పనిచేశాను. చట్టాన్ని గౌరవించే వారు దాన్ని రక్షించాలనే భావజాలం ఉన్న మనుషుల్లో నేను కూడా ఒకడిని. కాబట్టి ఈ కేసు దర్యాప్తుకు సహకరిస్తానని పోలీసులకు, కోర్టుకు కూడా చెప్పాను. నేను పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ చేస్తున్నది మాత్రం జర్నలిస్టు పనే. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన నా లాంటి వారిని ఎక్కడో ఒక చోట, దశాబ్దానికి ఒకసారో జగన్మోహన్ రెడ్డి గారి వంటి నాయకులు మా మాలాంటి వారిని గుర్తించి పైకి లాగుతునప్పుడు ఇలా వేధింపులకు గురి చేయడం ఇబ్బందికరంగా అనిపించింది. నేను ఆత్మవిశ్వాసంతో, దైర్యంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి వెనుక నడిచినప్పుడు ఆయన శ్వాస తగిలినా, మాట వినిపించినా, ఆయన దేహం పక్కన నడిచినా ధైర్యం లేని వారికి ధైర్యం వస్తుంది, ధైర్యం ఉన్న వారికి వారి ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది. ఎప్పుడూ తప్పులు చేయాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి వ్యక్తిత్వ హననం చేయాలనుకునే వాళ్లు వివరణ అడిగితే ఇచ్చేందుకు సిద్దంగా ఉంటాను. కష్టకాలంలో అండగా నిలిచిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్జి గారెకి, పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ కేజే భారత్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఇతర నాయకులకు పూడి శ్రీహరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోలీసులు చట్ట పరిధి దాటొద్దు: వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి హెచ్చరిక కొందరు యూనిఫామ్ లేని పోలీసులు పూడి శ్రీహరిని నిన్న ఉదయం 8.30 గంటలకు అక్రమంగా అడ్డంగించి నిర్బంధించారు. వెంటనే మా పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. మీరేం చేస్తారో తెలియదు, శ్రీహరికి అన్యాయం జరగడానికి వీల్లేదు, చట్టపరంగా ఆయన్ను రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు బెంగళూరు నుంచి లాయర్లు విజయరాఘవరెడ్డి, సప్తగిరి రెడ్డి, జైపాల్ రెడ్డి, ప్రేమ్ కుమార్ బృందం కుప్పం వచ్చి శ్రీహరి గారెకి బెయిల్ ఇప్పించారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, మిమ్మల్ని రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్తున్న దుర్మార్గపు పాలక పక్షానికి చట్టం లేదు, న్యాయం లేదు. కోర్టుల మీద గౌరవం లేదు. ఈ రాష్ట్రాన్ని వీళ్లు రావణకాష్టంలా తగులబెడుతున్నారు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్యాడర్ నుంచి లీడర్ వరకూ లీగల్ టీమ్ పైర్ వాల్ వాల్ గా కాపాడుతున్నాం. కాబట్టి పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎంతవరకూ ఇబ్బంది పెడుతుందో చూస్తాం, వీలైనంత వరకూ చట్ట పరిధిలో కార్యకర్తలకు రక్షణ కల్పిస్తాం. సోషల్ మీడియా పోస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్ పెట్టి వేధిస్తున్నారు. ఈ సెక్షన్ పెట్టాలంటే కనీస ఆధారాలు ఉండాలి. కానీ ఎవరినో సంతృప్తి పర్చేందుకు పోలీసులు దీన్ని ఎడాపెడా వాడేస్తున్నారు. పోలీసులు చట్ట పరిధి దాటితే మాత్రం సాధారణ పౌరుల తరహాలోనే మినహాయింపు ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. చట్ట ప్రకారం వ్యవహరించాలని పోలీసుల్ని కోరుతున్నాం. ఇవాళ మరోసారి న్యాయం గెలిచింది: కేజేఆర్ భరత్, ఎమ్మెల్సీ నిజంగా ఈరోజు న్యాయం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. పాతికేళ్లకు పైగా జర్నలిజం అనుభవం ఉన్న శ్రీహరి గారిని కేవలం రాక్షసానందం పొందేందుకు అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ నిలబడదని తెలిసి కూడా డయాబెటిక్ పేషెంట్ అయిన ఆయన్ను కుప్పం వరకూ తీసుకొచ్చి రోజంతా వేధించి కోర్టులో ప్రవేశపెట్టారు. చిత్తూరు నుంచి ఇద్దరు, ముగ్గురు పీపీల్ని పిలిపించుకుని టీడీపీ పెద్దల్ని సంతృప్తి పర్చాలనే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి బృందం శ్రీహరి గారికి అండగా నిలిచి బెయిల్ ఇప్పించడం సంతోషంగా ఉంది. కుప్పంలో ప్రభుత్వం అణగదొక్కే కార్యకర్తలే మీకు భయపడటం లేదు. అందుకే శ్రీహరి గారి లాంటి వారిని అరెస్టు చేసి కార్యకర్తల్ని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో కొమ్మినేని శ్రీనివాసరావు వంటి జర్నలిస్టుల్ని ఇలాగే ఇబ్బంది పెట్టారు. కానీ ఇవాళ మరోసారి న్యాయం గెలిచింది. వైయస్ఆర్సీపీ ఇలాంటి చర్యల్ని ఎండగడుతూనే ఉంటుంది. కుప్పంలో ఎప్పుడూ వైయస్ఆర్సీపీకి ప్రాణం ఇచ్చే కార్యకర్తలు వేల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా మేం గట్టిగా నిలబడతాం. కుప్పం నుంచే మా గెలుపు ప్రారంభమైంది.