అనంతపురం: ఎన్నికల్లో నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3 వేల భృతి ఇస్తామని మాటిచ్చి చంద్రబాబు మోసం చేశారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హరి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావని చంద్రబాబును ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని ధ్వజమెత్తారు. ఈనెల 4వ తేదీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిన సందర్భాన్ని పురస్కరించుకుని వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ను వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి , వైయస్ఆర్సీపీ మేధావుల ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తనిషా , మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవిలతో కలిసి హరిప్రసాద్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించారని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే రూ. 3 వేల భృతిగానీ చెల్లిస్తామని బాబు చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద యేటా రూ. 20 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందించడం ద్వారా రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామి ఎక్కడికి పోయిందన్నారు. పంటలకు గిట్టుబాటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంటలు నష్టపోయిన వారికి పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం లేదన్నారు. ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకునే వారు ఉంటే అంత మందికి తల్లికి వందనం కింద రూ. 15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పెన్షన్ ఇస్తామన్న హామి ఇంతవరకు అమలు కాలేదన్నారు. సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని చెప్పి కొందరికి మాత్రమే ఇప్పటికి ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకపోవడం వల్ల చాలామంది పేద విద్యార్థులు మధ్యలోనే చదువులుకు స్వస్తి చెప్పే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి దీవెన పూర్తిగా రద్దు చేయడం అన్యాయమన్నారు. ఉద్యోగులకు నాలుగు డీఏ బకాయిలు, పీఆర్సీ, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వలేదన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈనెల 4వ తేది ఉదయం 10 గంటలకు అనంతపురం నగరంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హరిప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు.