తాడేపల్లి: గత అసెంబ్లీ ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి, అధికారంలోకి వచ్చిన తర్వాత, అన్నింటినీ మర్చిపోయింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా, ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రకటించిన `సూపర్ సిక్స్’ హామీలతో పాటు 143 వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అలా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయి. దీంతో పిల్లలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు.. ప్రతి ఒక్కరూ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అన్ని రంగాలు తిరోగమనం. స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం. మరోవైపు తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్. ఒక్కటంటే ఒక్క పథకం అమలు చేయకపోయినా ఏడాది కాలంలో దాదాపు రూ.1.50 లక్షల కోట్ల అప్పు. మరోవైపు యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడంతో, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మహిళలు, బాలికలు, దళితులకు రక్షణ కరువైంది. ఇదీ టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్వాకం. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైయస్ఆర్సీపీ ఉద్యమబాట పట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వెన్నుపోటు దినంగా పాటిస్తూ.. అన్ని వర్గాల ప్రజలతో కలిసి భారీగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గాల కేంద్రాల్లోని ఉన్నతాధికారులకు వైయస్ఆర్సీపీ నేతలు డిమాండ్ పత్రాలు అందించారు. పోలీసుల వేధింపులు, నిర్బంధాలను వైయస్ఆర్సీపీ నేతలు, శ్రేణులు లెక్క చేయకుండా ప్రజల పక్షాన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కూటమి ప్రభుత్వం మోసాలు ఇలా: రైతు భరోసా: – కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, తాము రూ.20 వేలు ఇస్తూ, మొత్తం రూ.26 వేల పెట్టుబడి సాయం చేస్తామని తొలుత ప్రకటించారు. ఆ తర్వాత మాట మార్చి, కేంద్రం ఇచ్చే దాంతో కలిపి ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం చేస్తామని వెల్లడించారు. – అయితే వరసగా రెండో ఏడాది ఖరీఫ్ సీజన్ దాదాపు ప్రారంభం అవుతున్నా, ఇస్తానన్న రైతు భరోసా రూ.20 వేల ఊసే లేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. అలా ప్రతి రైతుకు రూ.40 వేల బాకీ. – గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24 నాటి లెక్కలు చూసినా.. రైతు భరోసా కింద 53,58,266 మంది రైతులకు పెట్టుబడి సాయం చేశారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.10,717 కోట్లు కేటాయించాలి. కానీ తొలి బడ్జెట్లో రూ.1000 కోట్లు చూపినా, ఒక్కరికి కూడా పెట్టుబడి సాయం చేయలేదు. – ఈ రెండో ఏడాది ప్రతి రైతుకు మరో రూ.20 వేలు కలుపుకుంటే.. మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే..రూ.40 వేలు ప్రతి రైతుకు చంద్రబాబు ఎగనామం పెట్టాడు..బాకీ పడ్డాడు. అమ్మ ఒడి: – ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎగనామం పెట్టారు. రెండేళ్లకు ప్రతి పిల్లాడికి రూ.30 వేలు బాకీ పడ్డారు. – ప్రతి పిల్లాడికి ఏటా రూ.15 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.13,112 కోట్లు కావాలి. కానీ తొలి ఏడాది బడ్జెట్లో చూపిన కేటాయింపు రూ.5386 కోట్లు. కానీ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రెండో ఏడాది బడ్జెట్ ఎట్ఏ గ్లాన్స్లో రూ.9407 కోట్లు గానూ, డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో రూ.8,278 కోట్లు గానూ చూపారు. ఎక్కడా రూ.13,112 కోట్ల ప్రస్తావన లేదు. – ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు. ఎలాగూ మోసం చేయడమే. ఏదో ఒక నంబర్ పెట్టాలి అని నడిపిస్తున్నారు. ఆడబిడ్డ నిధి: – 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తామన్నారు. దాన్ని ప్రతి ఇంటికీ ప్రచారం చేస్తూ ఆడ బిడ్డ నిధి అని దీనికి ఒక బ్రహ్మాండమైన పేరు పెట్టారు. – ఓటర్ల లిస్టు మన కళ్ల ముందే ఉంది. మొన్నే ఓటింగ్ అయిపోయింది. 2.07 కోట్ల మంది మహిళా ఓటర్లు ఓటు వేశారని మన కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ఆధార్ కార్డు నంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. – వాళ్లంతా 18 సంవత్సరాలు నిండిన వారే. అందుకే ఓటర్లు అయ్యారు. 2.07 కోట్ల మందిలో 60 ఏళ్లు పైబడిన వాళ్లను తీసేస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు దాదాపుగా. – మరి ఈ 1.80 కోట్ల మందికి ఏటా రూ.18 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.32,400 కోట్లు కేటాయింపులు చేయాలి. నిరుడు బడ్జెట్లో కేటాయింపులు సున్నా. ఈ బడ్జెట్లో కేటాయింపులు సున్నా. – అంటే ప్రతి మహిళకూ టీడీపీ కూటమి ప్రభుత్వం పడిన బకాయి ఏకంగా రూ.36 వేలు. ఉచిత బస్సు: – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. నిజానికి ఇది చాలా చిన్న హామీ. దీనికి నెలకు రూ.275 కోట్లు కావచ్చు. సంవత్సరానికి మహా అయితే రూ.3500 కోట్లు కావచ్చు. – తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిరుద్యోగ భృతి: – ఏటా 4 లక్షల ఉద్యోగాలు. అలా ఇచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు. – కానీ, ఇవ్వకుండా తొలి ఏడాది రూ.36 వేలు ఎగ్గొట్టారు. రెండో ఏడాది కూడా కేటాయింపు లేదు. అంటే అది మరో రూ.36 వేలు. అలా రెండేళ్లకు కలిపి ప్రతి నిరుద్యోగికి కూటమి ప్రభుత్వం రూ.72 వేలు బాకీ. దీపం. గ్యాస్ సిలిండర్లు: – రాష్ట్రంలో దీపం పథకంలో అర్హులైన కుటుంబాలు 1.59 కోట్లు. ఈ సంఖ్య మినిస్ట్రీ ఫర్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వెబ్సైట్లోనూ, పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్లోనూ క్లియర్ గా కనిపిస్తుంది. – దీపం పథకంలో ప్రతి కుటుంబానికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఆ మేరకు ఏటా రూ.4 వేల కోట్లు కావాలి. కానీ తొలి ఏడాది కేటాయించింది కేవలం రూ.865 కోట్లు మాత్రమే. ఎంత మందికి, ఎన్ని సిలిండర్లు ఇచ్చారో లెక్క లేదు. – ఇక రెండో ఏడాది పథకం కోసం బడ్జెట్లో చూపిన మొత్తం రూ.2,439 కోట్లు మాత్రమే. ఆ నిధులతో ఎంత మందికి, ఎన్ని సిలిండర్లు ఇస్తారనేది తెలియదు. పెన్షన్: – 50 ఏళ్లు దాటిన మహిళలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. అలా ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. – నిజంగా 50 ఏళ్లు పెన్షన్ ఇవ్వాలి అంటే.. బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఇదే మాదిరి పెన్షన్లు ఇవ్వాలీ అంటే.. మరో 20 లక్షల కుటుంబాలు యాడ్ అవుతాయి. ప్రస్తుత పెన్షన్ల సంఖ్యకు.. ఈ 20 లక్షల కుటుంబాలకు కూడా రూ.4 వేలు చొప్పున లెక్కేసుకుంటే.. అక్షరాలా రూ.9,600 కోట్లు కేటాయింపులు చేయాలి. – కానీ తొలి ఏడాది రూ.9,600 కోట్లు ఎగరగొట్టేశాడు. పోనీ ఈ ఏడాది కేటాయింపులు చేశాడా? ఏమన్నా ఇస్తాడా అని చూస్తే.. ఈ ఏడాది కూడా ఎగరగొట్టేశాడు.ంటే మహిళలకు మళ్లీ మరో 96 వేలు ఈ ఒక్క పథకం ద్వారా రెండోళ్లలో జరిగిన మోసం. విద్యాదీవెన. వసతి దీవెన: – పెద్ద చదువులు చదువుతున్న పిల్లాడికి ఫీజు రీయింబర్స్మెంట్గా విద్యాదీవెన కింద, ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్ల చొప్పున ఏటా రూ.2,800 కోట్లు. – అలాగే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఖర్చులకు గానూ వసతి దీవెన కింద గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. అలా ఈ రెండింటికీ ఏడాదికి రూ. 3,900 కోట్లు ఖర్చు చేయాలి. – కాగా, రెండు పథకాలకు సంబంధించి గత ఏడాది రూ.3,200 కోట్ల బకాయిలు పెట్టగా, ఈ ఏడాది అమలు చేయాలంటే మరో రూ.3,900 కోట్లు కావాలి. రెండూ కలిపితే పిల్లలకు రూ. 7,100 కోట్లు కావాలి. – కానీ, ఈ ఏడాది బడ్జెట్లో విద్యాదీవెన కింద చూపిన మొత్తం రూ.2,600 కోట్లు మాత్రమే. అంటే పిల్లలను వారి చదువులకు దూరం చేసే కుట్ర. ఆరోగ్యశ్రీ. ఆరోగ్య ఆసరా: – ఆరోగ్యశ్రీ పథకంలో నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం లేదు. నెలకు రూ.300 కోట్ల చొప్పున గత ఏడాది రూ.3,600 కోట్లు బకాయి పడ్డారు. బిల్లులు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులు వైద్యానికి నిరాకరిస్తున్నాయి. – ఇక శస్త్ర చికిత్స తర్వాత రోగికి విశ్రాంతి సమయంలో, వైద్యులు సూచించినంత కాలం చేసే ఆర్థిక సాయం ‘ఆరోగ్య ఆసరా’ ఊసే ఈ కూటమి ప్రభుత్వం ఎత్తడం లేదు. దాంతో దానికి మంగళం పాడినట్లే. ఆసరా పెన్షన్లు: – ఇక పెన్షన్ల విషయానికి వస్తే.. గత ఏడాది ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఏకంగా 66,34, 372 పెన్షన్లు ఇస్తూ ఉంటే.. కూటమి ప్రభుత్వంలో అవి 62,10,969కు పడిపోయాయి. – అంటే ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో కొత్తగా ఒక్క పెన్షన్ కూడా యాడ్ కాకపోగా, ఉన్న పెన్షన్లు కూడా తగ్గించుకుంటా పోతున్నారు. – ఇప్పటికే దాదాపు 4 లక్షల పెన్షన్లు తగ్గాయి. కాగా, మామూలుగా 66,34,372 పెన్షన్లు లెక్కన చూస్తే, అందుకు రూ.32 వేల కోట్లు కావాలి. – కానీ కేటాయించింది రూ.27 వేల కోట్లు మాత్రమే. అంటే పెన్షన్లు మరింత తగ్గించే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా సూపర్ సిక్స్.. సూపర్ సెవన్లు పక్కన పెడితే.. మిగిలిన 143 హామీల పరిస్థితి దారుణం. – బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ కట్. వాలంటీర్లకు రూ.10 వేల జీతం కట్. అంత కంటే దారుణం. వారి తొలగింపు. – పెళ్లి కానుక రూ.లక్ష కట్. పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు లేదు. – చంద్రన్న బీమా. సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవవాత్తూ మరణిస్తే రూ.10 లక్షలు అన్నారు. అదీ గాలికెగిరిపోయింది. – డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నారు. ఇదీ ఒట్టి మాటే అయింది. మరోవైపు సున్నా వడ్డీ రుణాలు కూడా శూన్యం. – ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు.. హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్కు ఏటా రూ.15 వేలు అన్నారు. ఇది గత ప్రభుత్వంలో అమలు చేసిన వాహనమిత్ర పథకం. ఇదీ గాలికి పోయింది. – ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నారు. ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వ. అనైతిక పర్వం: – రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక, సీఎం చంద్రబాబుగారి సారథ్యంలో జరిగిన హత్యలు 390. – హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైయస్సార్ సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. – వైయస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైయస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. – అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది. – కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. – దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది. – మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. – ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజా సంఘాల నాయకులు ఇద్దరు. అధికారులకు వేధింపులు: – టీడీపీ కూటమి పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. – ఐపీఎస్లు డీజీ ర్యాంక్ అధికారి. పీఎస్ఆర్ అంజనేయులు. మరో డీజీ ర్యాంక్ దళిత అధికారి సునీల్కుమార్. – అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి సంజయ్. సీనియర్ ఐపీఎస్ ఐజీ ర్యాంక్ అధికారి కాంతిలాల్ రాణా, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ విశాల్ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి. – ఇంకా ఐపీఎస్ అధికారులు రవిశంకర్ రెడ్డి, నిశాంత్రెడ్డి, పి.జాషువా కూడా వేధింపులకు గురయ్యారు. – మరో రిటైర్డ్ అధికారి విజయ్పాల్ను అక్రమంగా అరెస్టు చేశారు. ఇవీ టీడీపీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రధాన అంశాలు. సంక్షేమం లేదు. అభివృద్ధి అంత కంటే లేదు. పథకాల అమలు లేదు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలైన పథకాలన్నింటికీ మంగళం పాడారు. అవి అమలు చేయకపోగా, వారిచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. కాబట్టి, కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేసేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలని వైయస్ఆర్సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.