హైదరాబాద్: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ పచ్చి అబద్ధాల పుట్ట అని, వైట్ పేపర్లు, ప్రోగ్రెస్ రిపోర్టుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న అసత్య ప్రచారాలను, అప్పులపై చెబుతున్న బూటకాలను ఆయన ఆధారాలతో సహా తిప్పికొట్టారు. సంక్షేమం, అభివృద్ధిని విస్మరించి డొల్ల ప్రచారాలు చేసుకుంటున్న వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు కచ్చితంగా తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ప్రెస్మీట్లో బుగ్గన రాజేంద్రనాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: ఆర్థిక శ్వేతపత్రం ఒక అబద్ధాల పుట్ట: రెండేళ్ల వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పాలనపై సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రం ఒక అబద్ధాల పుట్ట. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రం అంధకారంలో ఉన్నట్లు, పాతరాతి యుగంలో ఉన్నట్లు చిత్రీకరించడం ఆయనకు అలవాటే. మొదట ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఏమీ లేదని చెప్పడం, ఆ తర్వాత తానేదో వెలుగు నింపినట్లు ప్రచారం చేసుకోవడం ఆయన మోడస్ ఆపరెండి. తానే సెల్ఫోన్, కంప్యూటర్ కనిపెట్టినట్లు, హైదరాబాద్ కట్టినట్లు, చివరికి సంక్రాంతి పండుగ కూడా నేర్పించినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరం. ప్రజాస్వామ్యంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలు ఇవ్వాలి గానీ, తనకు తానే ఇచ్చుకోవడం ఏంటి? అప్పులపై పచ్చి అబద్ధాలు.. ‘లోటు ఒక మిథ్య’ అనడం వింత!: అప్పు ఒక బూటకం అని, ‘లోటు ఒక మిథ్య’ అని చెప్పడం ప్రపంచంలోనే పెద్ద వింత. వైఎస్సార్సీపీ హయాంలో రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని పచ్చి అబద్ధాలు చెప్పారు. నిజానికి ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) లెక్కల ప్రకారం, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి చేసిన వాస్తవ అప్పు కేవలం రూ.7.22 లక్షల కోట్లు మాత్రమే. అందులోనూ అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.91 లక్షల కోట్లు అయితే, మా హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3.31 లక్షల కోట్లు మాత్రమే. అదే ఈ రెండేళ్లలో వెన్నుపోటు పార్టీ కూటమి అంతకు మించిన అప్పు చేసి, ఆర్థిక లోటును దారుణంగా పెంచింది. రైతులు, మహిళలకు వెన్నుపోటు..: సూపర్ సిక్స్ సూపర్హిట్ అయిందని చెప్పుకోవడానికి చంద్రబాబుకు అసలు సిగ్గుండాలి. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఈ రెండేళ్ల పాలనలో సంతోషంగా లేడు. పంటలకు మద్దతు ధర లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఉచిత పంటల బీమా బంద్ చేశారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1500 ఎవరికిచ్చారు? అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఎవరికైనా ఇచ్చారా? ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఏమైంది? ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అరాకొర అమలు చేసి చేతులు దులుపుకున్నారు. సూపర్సిక్స్ పేరుతో ఇంటింటికీ వెళ్లి ఓట్లు వేయించుకుని ప్రజలను దారుణంగా మోసగించారు. ప్రజల జీవితాల్లో మార్పు లేకుండా ప్రోగ్రెస్ ఎలా సాధ్యం?: మీ పాలనలో ప్రోగ్రెస్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇన్ని రిపోర్టులు, ఇన్ని పుస్తకాలు అవసరం లేదు. ఒక సామాన్యుడిని, ఒక రైతును, ఒక మహిళను, ఒక కార్మికుడిని, ఒక యువకుడిని అడిగితే చాలు. రైతును మీ పంటకు మంచి ధర ఉందా, ఇన్సూరెన్స్ వచ్చిందా, మద్దతు ధర అమలవుతోందా, ఇన్పుట్ సబ్సిడీ అందుతోందా అని అడిగితే లేదనే సమాధానం వస్తోంది. మహిళను అడిగితే ఆదాయం పెరిగిందా, హామీ ఇచ్చిన పథకాల ప్రయోజనాలు పూర్తిగా అందుతున్నాయా? అంటే లేదనే చెబుతున్నారు. కార్మికుడి ఆదాయం పెరగలేదు, నిత్యావసరాల ధరలు మాత్రం పెరిగాయి. యువతను అడిగితే ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఏ ఒక్క రంగంలో అయినా ధరలు తగ్గాయని, ప్రజల ఆదాయం పెరిగిందని చెప్పగలిగితే చెప్పండి. అప్పుడు ఇంత పెద్ద పుస్తకాలు, రిపోర్టులు అవసరం లేదు. ప్రజల జీవన విధానంలో మార్పు కనిపించకుండా ప్రోగ్రెస్ ఎలా వచ్చింది? రైతు జీవితంలో మార్పు లేదు, మహిళ జీవితంలో మార్పు లేదు, కార్మికుడి జీవితంలో మార్పు లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, విద్యార్థులకు గతంలో ఉన్న నాడు–నేడు తరహా అభివృద్ధి కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీలో నెట్వర్క్ ఆసుపత్రుల బిల్లులు పెండింగ్లో ఉండటంతో పేదలకు వైద్యం అందడం కూడా ఇబ్బందిగా మారింది. ప్రజా స్పందనే పనితీరుకు కొలమానం: మరోవైపు ప్రతిపక్ష నేతగా జగన్గారు ప్రజా సమస్యలపై బయటకు వస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? మామిడి రైతుల సమస్య కోసం వెళ్లినా, పొగాకు రైతుల సమస్య కోసం వెళ్లినా, మత్స్యకారుల సమస్యల కోసం వెళ్లినా ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది? ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ప్రతిపక్ష నాయకుడి బాధ్యత. జగన్గారు బయటకు వస్తే ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలి రావడం, ప్రభుత్వ సమావేశాలకు ప్రజలను సమీకరించాల్సి రావడం ఎందుకో ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చిందా లేదా అన్నదే అసలు ప్రోగ్రెస్కు కొలమానం. మీ మీడియా ఏం చేస్తుందో మీరే ఆలోచించాలి: జగన్గారు బయటకు వస్తే ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడాన్ని మీకు సంబంధించిన మీడియా సంస్థలు కూడా తట్టుకోలేక పిచ్చి విమర్శలు చేస్తున్నాయి. ఇలాంటి మీడియా మీకు మంచి చేస్తుందో, చెడు చేస్తుందో మీరే ఆలోచించాలి. ఇంగ్లిష్లో ఒక సామెత ఉంది. ‘విత్ ఫ్రెండ్స్ లైక్ దిస్, హూ నీడ్స్ ఎనమీస్’ అని.. అంటే ‘ఇలాంటి మిత్రులు ఉంటే మీకు శతృవులతో పనేముంది?’ అని అర్ధం. మరో సామెత కూడా ఉంది. ‘ఓ గాడ్, హెల్ప్ మీ ఫ్రమ్ మై ఫ్రెండ్స్, సో దట్ ఐ కెన్ ఫైట్ మై ఎనిమీస్’ అని. అందుకే ఒక్కసారి ఆలోచించండి. మీకు సంబంధించిన మీడియా వాస్తవాలను చూపించకుండా కేవలం జగన్గారి పర్యటనలపై విమర్శలు చేయడం మీకు ఏమైనా మేలు చేస్తుందా? ప్రజలు చూస్తున్న వాస్తవాన్ని పక్కనపెట్టి, దానికి భిన్నంగా ప్రచారం చేస్తే పబ్లిక్ దాన్ని నిజమని నమ్ముతుందా? ఒక్కసారి మీరే ఆలోచించండి. నాడు సంక్షేమం–అభివృద్ధి ప్రత్యక్ష ప్రమాణం: గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్గారి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఇవన్నీ వాస్తవాలు కాదా అని ప్రశ్నిస్తున్నాను. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.35 లక్షల యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. వైద్య, ఆరోగ్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చాం. గ్రామీణ వైద్యం కోసం 10,032 విలేజ్ క్లినిక్స్ నిర్మించాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చడానికి రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు చేపట్టి, అయిదింటిని పూర్తి చేశాం. ఇవన్నీ కళ్లకు కనిపిస్తున్న వాస్తవాలు. రైతు సంక్షేమం: 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతన్నకు అడుగడుగునా తోడుగా నిలిచాం. ఉచిత పంటల బీమా కింద 54.5 లక్షల మంది రైతులకు రూ.8 వేల కోట్లు చెల్లించాం. నాడు–నేడు మనబడి కార్యక్రమంలో మొదటి దశలో 15,715 స్కూళ్లు, రెండో దశలో 22,344 ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాం. రూ.25 వేల కోట్ల ఖర్చుతో 4 నూతన పోర్టులు, 6 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. మహిళా సాధికారత: అమ్మ ఒడి ద్వారా రూ.26 వేల కోట్లు. ఎస్సార్ ఆసరా ద్వారా రూ.25,500 కోట్లు, చేయూత ద్వారా రూ.20 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. మరి బ్యాంక్ రుణాలూ బూటకమా?: మీరు ఇప్పుడు కొత్తగా ‘అప్పు అనేది ఒక బూటకం. ద్రవ్యలోటు ఒక మిథ్య’ అంటున్నారు. అప్పు బూటకం అయితే అది ఆంధ్రప్రదేశ్కు మాత్రమేనా? ప్రపంచంలో అందరికీ వర్తిస్తుందా? ఒక సామాన్యుడు బ్యాంకులో తీసుకున్న అప్పు కూడా బూటకమేనా? ప్రైవేట్ సంస్థలు తీసుకునే రుణాలు కూడా బూటకమేనా? హెరిటేజ్కి ఉన్న అప్పులు కూడా బూటకమేనా?. 2024 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై రూ.10 లక్షల కోట్లు, రూ.12 లక్షల కోట్లు, రూ.15 లక్షల కోట్ల అప్పులు అంటూ మీరు చేసిన ప్రచారం కూడా బూటకమే కదా? మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లెక్కలు, కాగ్ లెక్కల ప్రకారమే 2024 నాటికి రాష్ట్ర ప్రత్యక్ష అప్పు రూ.4.92 లక్షల కోట్లు, గ్యారెంటీలతో కలిపితే రూ.6.47 లక్షల కోట్లు, విద్యుత్ రంగ బకాయిలను కలిపితే సుమారు రూ.7.22 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో మా హయాంలో చేసిన అప్పు, మీరు చేసిన అప్పు లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. ద్రవ్య లోటు కూడా మా హయాంలో ఏటా రూ.39,500 కోట్ల నుంచి రూ.62,500 కోట్ల వరకు ఉంటే.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024–25లో అది రూ.81 వేల కోట్లకు చేరింది. 2025–26 ప్రొవిజనల్ లెక్కల్లో సుమారు రూ.81,500 కోట్లుగా ఉంది. అందుకే మీకు సూటిగా ఒక ప్రశ్న.. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు అప్పు పెద్ద సమస్యగా కనిపించి, ఇప్పుడు అదే అప్పు బూటకం అని ఎలా అంటారు? అప్పు నిజం అయితే ప్రజలపై మీరు చేసిన విమర్శలు కూడా నిజం కావాలి. అప్పు బూటకం అయితే మీరు గతంలో చేసిన ప్రచారం మొత్తం బూటకమే కదా?. అవే ప్రగతికి అసలు కొలమానం: మీరు ఎన్ని ప్రోగ్రెస్ రిపోర్టులు, పుస్తకాలు విడుదల చేసినా ప్రజల జీవితాల్లో మార్పు కనిపించకపోతే దానికి అర్థం లేదు. 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి వృద్ధిలో దక్షిణ భారత్లో మొదటి స్థానంలో, దేశంలో ఐదో స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో పారిశ్రామిక పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై మీరు చెబుతున్న లెక్కల్లో వాస్తవాన్ని పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానమే వాస్తవాన్ని చెబుతోంది. 10 ప్రతిపాదనల్లో కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయని, కేవలం రూ.6,900 కోట్ల పెట్టుబడి, 22 వేల ఉద్యోగాలే వచ్చాయని పార్లమెంట్లో సమాధానం ఇచ్చారు. మరి ఏకంగా రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని ఎలా చెబుతారు?. ఒకవైపు ఆర్థిక లోటు, అప్పు బూటకం అంటున్నారు. మరోవైపు సంపద సృష్టిస్తున్నామని చెబుతున్నారు. అదే నిజమైతే, మీరు అంటున్నట్లు సంపద సృష్టిస్తే ఆదాయం ఎందుకు పెరగడం లేదు? రాష్ట్ర సొంత ఆదాయం ఎందుకు తగ్గుతోంది? రైతుకు మద్దతు ధర, ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ అందుతున్నాయా? మహిళలకు హామీ ఇచ్చిన ఏటా రూ.18 వేలు, మూడు ఉచిత సిలిండర్లు, పెన్షన్, అమ్మఒడి పూర్తిగా అందుతున్నాయా? యువతకు ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రోగ్రెస్ అని చెప్పడం ఎలా?. వీటిని విధ్వంసం అంటారా?: గత ప్రభుత్వ హయాంలో, జగన్గారి నేతృత్వంలో రాష్ట్రంలో వచ్చిన మార్పులివి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. 10,032 విలేజ్ క్లినిక్లు. 10,778 రైతు భరోసా కేంద్రాలు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా వేలాది పాఠశాలలు, ఆస్పత్రుల సమగ్ర అభివృద్ధి. ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు. వాటిలో 5 కాలేజీలు పూర్తి. కొత్తగా పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు. అమ్మఒడి, రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఆసరా, చేయూత, కాపునేస్తం, బీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేశాం. ఇవన్నీ డిస్ట్రక్షన్ అయితే.. ప్రజలకు మేలు చేసే కన్సŠట్రక్షన్ అంటే ఏమిటో మీరు చెప్పాలి. వీటిని ప్రజల ముందుంచే ధైర్యం ఉందా?: పోలవరం విషయంలోనూ 2023లో రూ.12,911 కోట్ల ఆమోదం, 2024లో రూ.30,435 కోట్ల ఫేజ్–1 ప్రతిపాదన, మార్చి 2024లో కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపిన ప్రక్రియ వంటి వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి. అమరావతిలో భూసమీకరణ, భూముల అభివృద్ధి చేసి అమ్మి అప్పులు తీర్చే విధానం నిజంగా రాజధాని నిర్మాణమా.. లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా అన్నది కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అందుకే ప్రోగ్రెస్ రిపోర్టులు, వైట్ పేపర్లు విడుదల చేయడం కంటే.. ఒక రైతును, ఒక మహిళను, ఒక యువకుడిని, ఒక కార్మికుడిని, ఒక విద్యార్థిని అడగండి. వారి జీవితాల్లో ఆదాయం పెరిగిందా? ఉపాధి పెరిగిందా? సంక్షేమం అందిందా? సౌకర్యాలు మెరుగయ్యాయా? అని అడిగితే అసలు ప్రోగ్రెస్ ఉందా లేదా ప్రజలే చెబుతారు. వాస్తవాలపై ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి.. ప్రచారంతో కాదు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ దందా: ఇక అమరావతిలో రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. చదరపు అడుగు నిర్మాణానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.20 వేల చొప్పున ఖర్చు చేస్తున్నారు. దీని వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉంది. హైదరాబాద్ నానక్రామ్గూడా వంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే భూమి విలువతో కలిపి భవనాలు చదరపు అడుగు రూ.5 వేల నుంచి రూ.6 వేలకు దొరుకుతుంటే, భూమి ఉచితంగా ఉండి కూడా ఇక్కడ ఏకంగా అదే చదరపు అడుగుకు రూ.20 వేలు ఖర్చు పెట్టడం వెనుక ఉన్న ముడుపులు ఎంతో చెప్పాలి. ప్రజలే తగిన బుద్ధి చెబుతారు: ఈ నేపధ్యంలో పాలన అంటే నాలుగు గోడల మధ్య కూర్చుని, రూముల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రోగ్రెస్ రిపోర్టులు రాయడం కాదని.. ధైర్యం ఉంటే బస్సు స్టాండ్లకు, రైల్వే స్టేషన్లకు, గ్రామాలలోని గృహిణుల వద్దకు వెళ్లాలని.. అప్పుడే కూటమి పాలనలో అభివృద్ధి జరిగిందో లేదో ప్రజలే చెబుతారని బుగ్గన రాజేంద్రనాధ్ తేల్చి చెప్పారు. అబద్ధాలు, మోసాలతో ఎక్కువ కాలం జనాలను మభ్య పెట్టలేరని.. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ అబద్ధాలను రాబోయే రోజుల్లో తిప్పికొట్టి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని బుగ్గన రాజేంద్రనాథ్ హెచ్చరించారు.