గుంటూరు జిల్లా: తెనాలి ప్రాంతానికి చెందిన గీతాంజలి కుటుంబానికి వైయస్ఆర్సీపీ తరఫున రూ.50,000 ఆర్థిక సాయం అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలుస్తూ పార్టీ నాయకులు ఈ సహాయాన్ని అందించారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు లబ్దిదారులకు అందాయని, దీనిపై ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని, మరోసారి జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలంతా ఆయనకే ఓటు వేయాలని కూడా గీతాంజలి సంతోషంగా మాట్లాడింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు తెగ వైరల్ గా మారాయి. ఇది వైయస్ జగన్ కు ఎక్కడ మంచిపేరు తీసుకొస్తాయని భావించి గీతాంజలిని సోషల్ మీడియా వేదికగా టీడీపీ బ్యాచ్ ఘోరంగా ట్రోల్ చేసింది. పాపం.. మహిళా అని కూడా చూడకుండా.. నోటికొచ్చినట్లు బూతులతో చెలరేగిపోయారు. దీంతో ఆ కామెంట్లు చూసిన ఆమె తీవ్ర మనస్తాపానికి గురైన గీతాంజలి 2024, మార్చి 7న తెనాలి రైల్వేస్టేషన్ కు వెళ్లి సూసైడ్ కు పాల్పడింది. ఈ ఘటన సీఎం వైయఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు వెళ్లింది. దీనిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రూ. 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే విధంగా మాట్లాడటం సబబు కాదన్నారు. మహిళలపై ట్రోలింగ్ కు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఆమె కుటుంబానికి వైయస్ఆర్సీపీ మరోసారి అండగా నిలిచి ఆర్థికసాయం అందించింది. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ఇంచార్జి అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే వైయస్ఆర్సీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కును అందజేశారు. ఇలాంటి కష్టకాలాల్లో పార్టీ నాయకులు ముందుండి సహాయం చేయడం వైయస్ఆర్సీపీకి ప్రత్యేకత అని వారు పేర్కొన్నారు. ప్రజలకు అండగా నిలబడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.