తాడేపల్లి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రాజకీయ లక్ష్యం ప్రజలు, వారి అజెండా కాదని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పతనమేనని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్రెడ్డి విమర్శించారు. రాజకీయంగా చంద్రబాబుకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా ఆమె రంగలోకి దిగుతారన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద ద్వేషం, అసూయలతో షర్మిల చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈ 15 నెలల కాలంలో ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు, ట్వీట్లు ఇందుకు నిదర్శనమన్నారు. అధికార పార్టీని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద విమర్శలు, కామెంట్లు చేయడం ఆమె నైజమన్నారు. వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల షర్మిల చేసిన కామెంట్స్పై కారుమూరి వెంకట్రెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద ద్వేషం, అసూయలతో షర్మిల చేస్తున్న రాజకీయాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ప్రజలకు ఇదివరకే అర్థం అయ్యాయి కాబట్టి… ఆమె మాటలను పెద్దగా మేం పట్టించుకోలేదు. కాని నిన్న వివేకానందరెడ్డి హత్యకేసు గురించి ఆమె మాట్లాడుతూ, ఇంకా నిందలు, ఆరోపణలు చేశారు. వివేకానందరెడ్డి హత్య ఘటన అంశాన్ని రాజకీయంగా మార్చుకునే ఉద్దేశంలో చంద్రబాబు కుట్రలో షర్మిల, నర్రెడ్డిసునీత.. ఇద్దరూ పావులే. నిజానికి వివేకానందరెడ్డి హత్య కేసులో నివృత్తి కాని ఎన్నో సందేహాల నేపధ్యంలో సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి యాంగిల్స్ విస్మరించలేనివి. తమ చుట్టూ ఆ సందేహాలు ఉన్నాయి కాబట్టే, వాటినుంచి పక్కదోవ పట్టించడానికి తానేదో పోరాటం చేస్తున్నట్టుగా భావన కల్పించేందుకు విశ్వ ప్రయత్నాలు. నర్రెడ్డి సునీత, షర్మిల కోరినట్టుగానే సీబీఐ దర్యాప్తు జరిగింది కదా? మరి ఇప్పుడు ఎవరి మీద నిందలు వేస్తారు?. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, వారు కోరినట్టుగానే సీబీఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఇంకా వీళ్లు ఎవర్ని తప్పుబడుతున్నారు. గూగుల్ టేకవుట్ అన్నది.. చంద్రబాబు , ఆయన మీడియ పన్నిన కథ. ఇదే నిజమైతే… మరెందుకు విచారణలో ఇది నిలబడలేదు. వాస్తవానికి హత్య జరిగిన సమయానికి, గూగుల్ టేకవుట్ సమయానికి మధ్య తేడాలున్నాయని కాబట్టి… ఆ వాదన చచ్చిపోయిందన్న విషయం నిజం కాదా? వివేకానందరెడ్డిని తామే హత్యచేశామని చెప్పిన దస్తగిరి సహా ఇతరులు దర్జాగా బయట తిరుగుతున్నారు. సెటిల్మెంట్లు చేస్తున్నారు. కనీసం వారి బెయిల్కు కూడా సునీత అడ్డుచెప్పలేదు కదా? దేనికోసం ఇది చేశారు? వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఆయన రాసిన లేఖను ఆరోజు దాచిపెట్టమన్నది సునీతే కదా? దీనిమీద ఆమె ఎందుకు ఎప్పుడూ స్పందించరు?. వివేకానందరెడ్డి ఫోన్లో డేటాను డిలీట్ చేసింది ఎవరు? ఇది చాలా కీలక అధారం కదా? దీనిమీద సమాధానం ఏంటి?. మరణానికి సుమారు 2 ఏళ్ల కిందటే వివేకానందరెడ్డి చెక్పవర్ను ఎందుకు రద్దుచేశారు? వివేకానందరెడ్డి బాగోగులను సునీత చూసుకోలేదన్నది నిజమే కదా? వివేకానందరెడ్డిగా రెండో భార్య అంశాన్ని, వారికి ఒక కుమారుడు పుట్టాడు అన్న అంశాన్ని దాచేయడానికి సునీత ఎందుకు ప్రయత్నించారు? దీనిమీద విచారణ ఎందుకు జరగడం లేదు?. రెండో భార్యకు, సునీతకు మధ్య జరిగిన సంభాషణలు, వాటి వివరాలు ఎందుకు బయటకు రావడంలేదు? ఈ కేసులో బీజేపీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి సాయపడుతోందని లేనిపోని మాటలు షర్మిల మాట్లాడతున్నారు. బీజేపీతో అంటకాగి ఉంటే…., ఈ కేసులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్దోషులైన, ఏ మాత్రం సంబంధం లేని వాళ్లు ఎందుకు జైళ్లలోకి నెట్టబడ్డారు? అవినాష్రెడ్డి తండ్రి వృద్ధుడు, ఆరోగ్యం బాగోలేకపోయినా ఆయన ఇబ్బంది పెట్టారు. షర్మిల చంద్రబాబుకు మద్దతు ఇస్తూ, లోపాయికారీగా వారితో కలిసిపోయి, కేవలం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పతనమే లక్ష్యంగా కుట్రలో భాగస్వాములై, మళ్లీ ఇప్పుడు అదే చంద్రబాబు కూటమిలో బీజేపీతో భాగస్వామిగా ఉన్నారు. మోదీతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటకాగుతున్నారంటూ ఏరకంగా మాట్లాడగలుగుతున్నారు. ఈ వాదనకు అర్థం పర్థం ఉందా?. ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు మాటలు మానుకోండి. అసత్యాలు, అబద్ధాలు మానేయండి.