కేంద్ర ప్రభుత్వ తప్పుడు పాలసీని ఒప్పుకోం

సొంత గనులు కేటాయిస్తే.. స్టీల్‌ ప్లాంట్‌ లాభాలబాట పడుతుంది

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశాన్ని పునఃసమీక్షించుకోవాలి

కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎంపీ మిథున్‌రెడ్డి

ఫైనాన్స్‌ బిల్లుపై స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతాం

ఢిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశాన్ని పునఃసమీక్షించుకోవాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖలోని అంశాలను ధర్మేంద్రప్రదాన్‌కు వివరించారు. అనంతరం ఎంపీ మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఎవరికో కారుచౌకగా ప్లాంట్‌ను కట్టబెట్టే బదులుగా కాస్త సహకారం అందిస్తే ప్లాంట్‌ లాభాలబాట పడుతుందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం పాలసీ తప్పు, ఆ తప్పుడు పాలసీకి ఒప్పుకోమని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో పోరాటం చేస్తున్నామన్నారు.  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయిస్తే లాభాలు వస్తాయని చెప్పారు. ల్యాండ్‌ బ్యాంక్‌ను సెక్యూరిటీగా చూపి ఫైనాన్షియల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయాలన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. 

అమరావతి సెంటిమెంట్‌పై చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదని ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. అమరావతిలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదన్నారు. బీజేపీకి చంద్రబాబు పాత మిత్రుడేనన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ లేఖలను కాపీ కొట్టి కంటితుడుపుగా చంద్రబాబు లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను రెచ్చగొట్టి గొడవ చేయమని ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. రేపు ఫైనాన్స్‌ బిల్లుపై విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని, ప్రధాన మంత్రిని స్వయంగా కలిసి పరిస్థితులు వివరిస్తామని చెప్పారు.  
 

Back to Top