అన్నమయ్య జిల్లా: సంక్షేమ పథకాల ద్వారా కార్మికులకు ప్రోత్సాహం అందించిన ఘనత వైయస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని వైయస్ఆర్సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ తెలిపారు. మదనపల్లెలో వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (వైయస్ఆర్ టీయూసీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అవెన్యూ రోడ్డులోని వైయస్ఆర్సీపీకార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి వైయస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక నాయకుడని కొనియాడారు. సంక్షేమ పథకాల ద్వారా కార్మికులకు ప్రోత్సాహం అందించిన ఘనత వైయస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. వైయస్ఆర్ టీయూసీ ద్వారా కార్మికుల సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతూ పరిష్కారాల దిశగా ముందుకు తీసుకెళ్తున్న విధానం అభినందనీయమని తెలిపారు. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు అందజేసి ఆదుకున్నామని, చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేలు ఇచ్చిన పథకం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి కార్మికులకు భద్రత కల్పించినట్లు వివరించారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచడం, కల్లుగీత కార్మికుల ప్రమాద పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచడం వంటి నిర్ణయాలు కార్మిక సంక్షేమానికి నిదర్శనమని అన్నారు. నవరత్నాల పథకాల ద్వారా వివిధ వర్గాల కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, మస్తాన్రెడ్డి, నాగరాజరెడ్డి, సురేంద్ర, ఎన్. మస్తాన్ ఖాన్, నూర్, యూనస్, ఫయాజ్, షఫీ, రేవతి, ఎన్. నవాజ్, షానవాజ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.