జ‌గ‌న‌న్న పాల‌నలో మహిళలకు స్వర్ణయుగం

మహిళా రిజర్వేషన్ బిల్లుపై చ‌ర్చ‌లో ఎంపీ త‌నుజారాణి

 ఢిల్లీ: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగంలో మహిళలపై జరుగుతున్న హింస అంశాలను ప్రస్తావించారు. తనుజారాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సాధికారతకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. మహిళను తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా నియమించిన ఘనత వైయస్ జగన్ నాయకత్వానిదేనని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ‘అమ్మ ఒడి’ వంటి పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు ఇళ్ల పట్టాలను మహిళల పేర్లతోనే ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సాగిన పాలన మహిళలకు స్వర్ణయుగంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మహిళలపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీలోని కొందరు ప్రజాప్రతినిధులు మహిళలను వేధిస్తున్నప్పటికీ, ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, రాష్ట్రాన్ని కోరారు. చర్చ కొనసాగుతున్న సమయంలో సభాస్థానంలో ఉన్న టిడిపి ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ మైక్ కట్ చేయడంతో వివాదం నెలకొంది. మహిళా ఎంపీ మాట్లాడుతుండగానే మైక్ నిలిపివేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్టర్ తనుజారాణి, ఎంపీ గురుమూర్తి ఈ చర్యపై నిరసన తెలిపారు.

Back to Top