తాడేపల్లి, విశాఖపట్నం: పార్లమెంట్లో పెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకి వైయస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు మాజీ మంత్రి విడదల రజిని, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మరోసారి స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లతో దేశం రూపురేఖలే మారిపోతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి విడదల రజిని, విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిలు మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్సీపీ హయాంలోమహిళల రక్షణ, అభ్యున్నతికి పెద్ద పీట వేశారని, ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ తన పాలనలో దేశంలో తొలిసారిగా ఏపీలో మహిళలకు 50 రిజర్వేషన్లకు చట్టం చేయడంతోపాటు అమలు చేసి చూపించారని వివరించారు. కీలకమైన హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను మహిళలకు ఇచ్చి గౌరవించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ కరువైందని, కూటమి నాయకులే కీచకులై మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో మహిళలకు చీకటి రోజులుగా మారాయని మండిపడ్డారు. ఐదేళ్ల వైయస్ జగన్ పాలన మహిళలకు స్వర్ణయుగంగా ఉండేదని, నేడు చంద్రబాబు పాలనలో మహిళలకు భద్రత కరువైందని మాజీ మంత్రులు విడదల రజని ఫైరయ్యారు. మహిళలకు వైయస్ జగన్ చేసిన మేలును వేలెత్తి చూపించే హక్కు కూటమి నాయకులకు లేదని పుష్పశ్రీ వాణి స్పష్టం చేశారు. వారు ఇంకా ఏమన్నారంటే... విడదల రజిని, మాజీ మంత్రి మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకం మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతున్న ఈరోజు దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని దశాబ్దాలుగా వస్తున్న డిమాండ్ వాస్తవ రూపం దాల్చడం శుభపరిణామం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైయస్ఆర్సీపీ సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్టు ఇప్పటికే చెప్పడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశం రూపురేఖలే మారిపోతాయని స్పష్టంగా చెప్పగలను. కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. రాష్ట్రంలో ఏదో మూలన రోజూ మహిళలపై దాడులు, హత్యలు అఘాయిత్యాలు నిత్యకృత్యమైపోయాయి. మాటల్లో మాత్రం మహిళలపై చెయ్యేస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు చెప్పడమే కానీ నేరస్తులకు ఏ ఒక్కరికైనా శిక్ష పడిందేమో చూపించాలి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకుల ఆగడాలకు వంతపాడుతున్నారు. కనీసం బాధిత మహిళలు ఫిర్యాదు చేస్తే కేసులు కూడా నమోదు కావడం లేదు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. రెడ్ బుక్ ని అమలు చేయడానికే పోలీసులు పనిచేస్తున్నారు. అందుకే ఏపీ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అట్టడుగున 36వ స్థానంలో ఉంది. ఇదే పోలీస్ వ్యవస్థ వైయస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో దేశంలో మొదటి స్థానంలో ఉండేది. వైయస్ఆర్సీపీ హయాంలో తీసుకొచ్చిన జీవో ఎఫ్ఐఆర్ విధానం ఇప్పుడు అమలు కావడం లేదు. మహిళల భద్రత పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదు. గతంలో మా వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి 30 వేలమంది మహిళలు అదృశ్యమైపోయారని పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశాడు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఒక్కర్నయినా వెతికి తీసుకొచ్చేరేమో చూపించాలి. మహిళా సాధికారత, అభ్యున్నతి గురించి ప్రసంగాలు దంచడమే కానీ చంద్రబాబు మాత్రం మహిళలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాడు. కూటమి ప్రజాప్రతినిధులే మహిళలు వేధిస్తుంటే కనీసం కేసు కూడా నమోదు చేయడం లేదు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళల భద్రతే ప్రథమ ప్రాధాన్యం మహిళల అభ్యున్నతి, సాధికారత గురించి ఆలోచన చేసి అమలు చేసిన గొప్ప నాయకుడు దేశంలో వైయస్ జగన్ మాత్రమే. ఐదేళ్ల వైయస్ఆర్సీపీ పాలనలో మహిళలు మహరాణులుగా వర్థిల్లారు. 90 శాతం సంక్షేమ పథకాలు మహిళల కోసం రూపొందించినమే. ఆ విధంగా సమాజంలో మహిళల గౌరవాన్ని పెంచారు. వైయస్ జగన్ గారు తన ఐదేళ్ల పాలనతో సామాజిక చైతన్యం తీసుకొచ్చారు. మహిళల రక్షణ, సంక్షేమాన్ని వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంది. నామినేటెడ్ పోస్టులు, వర్కుల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. ప్రభుత్వంలో కీలకమైన హోంమంత్రి పదవులతోపాటు డిప్యూటీ సీఎం పోస్టుల్లో కూడా మహిళలకు అవకాశం కల్పించారు. మేయర్లుగా, జెడ్పీ చైర్పర్సన్లుగా మహిళలను నియమించి రాజకీయంగా ఎంతగానో ప్రోత్సహించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం. కానీ 2019-24 మధ్య వైయస్ జగన్ గారి పాలనలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేసి చూపించారు. వైయస్ఆర్సీపీ హయాంలో తమకు జరిగిన అన్యాయంపై మహిళలు నిరభ్యంతరకంగా ఫిర్యాదు చేయడానికి మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రతపై భరోసా ఇస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక శక్తి యాప్ గా పేరు మార్చేసి నిర్వీర్యం చేశారు. అన్యాయాలపై గొంతెత్తే మహిళలు పెరుగుతారు : మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మహిళా రిజర్వేషన్ బిల్లుకి వైయస్ఆర్సీపీ పూర్తిగా మద్దతు ఇస్తోంది. ఈ బిల్లు చర్చకొచ్చినప్పుడు దేశంలో అన్ని పార్టీల కన్నా ముందే వైయస్ జగన్ గారు స్వాగతించారు. దీనికోసం అనేక దశాబ్దాలుగా మహిళలు ఎదురు చూస్తున్నారు. జనాభాలో 50శాతం, కార్మిక శక్తిలో 40శాతం, ఐటీ రంగంలో 34 శాతం మంది మహిళలే ఉన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాల్లో మహిళలున్నారు. కానీ ఇప్పటివరకు మహిళలకు చట్టసభల్లో 14 శాతానికి మించి ప్రాతినిథ్యం ఉండటం లేదు. మహిళా రిజర్వేషన్ల బిల్లుతోనైనా చట్టసభల్లో మహిళల సంఖ్య పెరుగుతుంది. మహిళలు పాలిచ్చే తల్లులుగానే కాకుండా పాలించే సత్తా ఉందని నిరూపించుకుంటారు. మహిళా బిల్లు కారణంగా మహిళల సమస్యలపై, మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించే అవకాశం దక్కుతంది. చర్చలో పాల్గొని ప్రశ్నించే గొంతులు పెరుగుతాయి. ఇద్దరు ఎస్సీ మహిళలకు హోంమంత్రులుగా అవకాశం రాజకీయాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. అందుకు నేనే ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో డిప్యూటీ సీఎంగా మహిళలకు అవకాశం కల్పించింది వైయస్ జగన్ గారు మాత్రమే. ఇద్దరు దళిత మహిళలకు హోంమంత్రులుగా అవకాశం కల్పించారు. ఇద్దరు బీసీ మహిళలకు మంత్రులుగా అవకాశమిచ్చారు. ఒక ఓసీ మహిళను మంత్రిని చేశారు. కౌన్సిల్ ముస్లిం మహిళకు డిప్యూటీ చైర్ పర్సన్గా అవకాశం కల్పించారు. నేడు కూటమి ప్రభుత్వంలో దళిత మహిళకు అవకాశం కల్పించారంటే వైయస్ జగన్ గారి నుంచి తీసుకున్న ప్రేరణే కారణం. 31 లక్షల మంది మహిళల కోసం ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన ఘనత వైయస్ జగన్కే దక్కతుంది. మహిళల రక్షణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు. మేయర్లుగా, జెడ్పీ చైర్ పర్సన్లుగా సగం మంది మహిళలే వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలకు 50 శాతం పదవులు కేటాయించేలా రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. రాష్ట్రంలో 13 జెడ్పీ చైర్మన్ పోస్టులుంటే అందులో 7 పదవులు మహిళలు కేటాయించడం ఆయన గొప్పతనం. 26 జెడ్పీ వైయస్ చైర్పర్సన్ స్థానాల్లో మహిళలకు 15 స్థానాలు కేటాయించారు. 12 మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు కలిపి 36 స్థానాలుంటే అందులో మహిళలకు 18 స్థానాలు కేటాయించారు. 75 మున్సిపాలిటీల్లో 73 మున్సిపాలిటీలు వైయస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. అందులో 45 (64 శాతం)మున్సిపాలిటీలకు మహిళలను చైర్ పర్సన్లుగా నియమించారు. రాష్ట్రంలో సర్పంచ్లుగా 57 శాతం మంది, ఎంపీటీసీలుగా 54 శాతం మంది మహిళలే ఉన్నారు. వైయస్ఆర్సీపీ హయాంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా 53 శాతం మంది మహిళలే. 2.65 లక్షల మంది వలంటీర్లలో 53 శాతం మంది మహిళా వలంటీర్లే ఉన్నారు. 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాల్లో 51 శాతం మంది మహిళలే ఉన్నారు. నామినేటెడ్ పదవులు, వర్కుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా చట్టం చేసిన నాయకుడు దేశంలో వైయస్ జగన్ మాత్రమే ఉంటారు. రాష్ట్రంలో 202 మంది ఏఎంసీ చైర్మన్లలో 102 మంది మహిళలే ఉన్నారు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని నాయకులు ప్రసంగాలు మాత్రమే చేస్తారు. దాన్ని ఆచరించి చూపించిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. సంక్షేమ పథకాలతో మహిళలకు ఆర్థిక చేయూత మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. సంక్షేమ పథకాల రూపంలో రూ. 2.83 లక్షల కోట్లు ఖర్చు చేశారు. కేవలం డీబీటీ ద్వారానే రూ. 1.89 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేశారు. అమ్మ ఒడి, పీజు రీయింబర్స్మెంట్, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలకు వైయస్ఆర్సీపీ చేసిన మేలును అబద్ధమని చెప్పగలిగే దమ్ము కూటమి నాయకులు లేదు. వేలెత్తి చూపించే అర్హత కూటమి నాయకులకు లేదు మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న తరుణంలో వైయస్ జగన్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. వైయస్ఆర్సీపీ హయాం మహిళలకు స్వర్ణయుగంలా ఉండేది. నేడు ఖర్మ యుగం అయిపోయింది. ఎక్కడ చూసినా మహిళపై దాడులు జరుగుతున్నాయి. మహిళలను చంపేస్తుంటే నిందితులను పట్టుకోలేని చంద్రబాబుది అసమర్థ పాలన. హోంమంత్రి అనిత మహిళలకు రక్షణ కల్పించడం చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతోంది. వంద రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పినా గంజాయి తరలిస్తూ, సేవిస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలే దొరికిపోతున్నారు. డ్రగ్స్ వాడుతూ తెలుగుదేశం ఎంపీ పట్టుబడ్డాడు. మహిళలను వేధిస్తున్న వారంతా టీడీపీ నాయకులే. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు అఘాయిత్యాలు జరగడానికి కారణం రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం, గంజాయి, డ్రగ్స్ లే. 24 గంటలు మద్యం దొరికేలా బెల్ట్ షాపులు తెరిచారు. గత ఐదేళ్లలో మహిళలకు జరిగిన మేలుపై వేలెత్తి చూపించే అర్హత కూటమి నాయకులకు లేదు. సంక్షేమ పథకాల పేరుతో మహిళలను చంద్రబాబు దారుణంగా వంచించాడు.