ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఓ ఎస్టీ మహిళను బూటు కాలితో తన్ని చిత్రహింసలు పెడితే ఆయనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఎమ్మెల్యే తీరుతో గిరిజన మహిళ సూసైడ్ చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు, అధికారులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం వైయస్ఆర్సీపీ నేతల బృందం తిరువూరు నియోజకవర్గం ఏ. కొండూరు మండలం గోపాలపురంలో వైయస్ఆర్సీపీ మహిళా నేత భూక్య చంటి కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఏమన్నారంటే.. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు పార్టీ ప్రతినిధి బృందం గోపాలపురంలోని భూక్యాం చంటి కుటుంబాన్ని పరామర్శించింది. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అరాచకం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం పూర్తిగా అపహాస్యం పాలవుతోంది. రాజ్యాంగ విలువలకు పూర్తిగా తూట్లు పొడిచేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. భూక్యా చంటిపై దాడి దీనికి నిదర్శనం. వారి కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి ఆస్తిని భాగాలుగా విభజించుకునే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జోక్యం చేసుకోవడం, ఆ కుటుంబంలోని వారిపై బూటుకాలితో తన్ని దాడి చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఈ దాడి వల్ల భూక్యా చంటి మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితిని కల్పించారు. ఇటువంటి అరాచకాలు చేసే ఎమ్మెల్యే కొలికపూడి పరిపాలనలో ఏ రకంగా భాగస్వామిగా ఉండటానికి అర్హుడని ప్రశ్నిస్తున్నాం. దీనికి కొలికపూడి బాధ్యత వహించాలి. తక్షణం ఆయనపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడిని ఖండించింది. గిరిజన కుటుంబంపై అత్యంత హేయంగా జరిగిన ఈ దౌర్జన్యంకు కారకుడైన కొలికపూడి శ్రీనివాసరావును అధికార తెలుగుదేశం పార్టీ వెనకేసుకు రావడం దారుణం. క్రమశిక్షణ సంఘం పేరుతో ఆయనను పిలిపించి, ఏదో మందలించామన్నట్లుగా హైడ్రామా సృష్టించారు. నిజంగా చిత్తశుద్ది ఉంటే తక్షణం కొలికపూడి శ్రీనివాసరావుపై చట్ట పరంగా కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచాలి. అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్న ఎమ్మెల్యే: దేవినేని అవినాష్ తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నాడని వైయస్ఆర్ సీపీ ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. సంక్రాంతికి ముందు ఒక ప్రైవేటు స్థలం వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జోక్యం చేసుకుని గోపాలపురం గ్రామంలోని వైయస్ఆర్సీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటి, ఆమె భర్త కృష్ణ, వారి కుమారులపై ప్రత్యక్షంగా దాడిచేసి గాయపరిచిన ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలి. బాధ్యతయుతమైన ఎమ్మెల్యే స్థానంలో ఉన్న నేత ఇటువంటి దాడులకు పాల్పడితే ఇక సామాన్యులకు రక్షణ ఉంటుందా? తెలుగుదేశం పార్టీ ఈ ఘటనపై పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న ఆగ్రహంతో క్రమశిక్షణ సంఘం పేరుతో హంగామా చేసి, చేతులు దులుపుకున్నారు. ఈ దాడిని చిత్రీకరించిన భూక్యా చంటి కుమారుడి సెల్ ఫోన్ ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుని దానిలోని వీడియోను డిలీట్ చేయడం ఎంత వరకు సమంజసం? గతంలో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఏనాడు ఇటువంటి దాడులను ప్రోత్సహించలేదు. నేడు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకం సృష్టిస్తున్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ ఎమ్మెల్యే అరాచకాలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూక్యా చంటి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్ సీపీ పోరాడుతుంది.