27 నుంచి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌

‘మేమంతా సిద్ధం’ పేరుతో తొలిసభ 27వ తేదీన ప్రొద్దుటూరులో ప్రారంభం

ప్రతి పార్లమెంట్, ప్రతి జిల్లా మేం సిద్ధం అనేలా బస్సు యాత్ర

సిద్ధం సభలకు దీటుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో సభలు

ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ బ‌స్సుయాత్ర

క్షేత్ర స్థాయిలో వివిధ వర్గాలతో ఇంటరాక్షన్‌..సలహాలు, సూచనల స్వీకరించనున్న సీఎం

పాదయాత్రలో ప్రజలతో మమేకమైనట్లే బస్సు యాత్ర కూడా సాగుతుంది

ఎంత మంది కూటమి కట్టినా.. మా బ్రాండ్ వైయ‌స్ జ‌గ‌న్ 

సీఎం బ‌స్సు యాత్ర షెడ్యూల్ వివ‌రించిన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, సీఎం వైయస్‌ జగన్‌ ఈనెల 27వ తేదీ నుంచి బస్సు యాత్ర చేపడతారని, ఇడుపులపాయ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఈ బస్సు యాత్ర చేపడుతున్నట్లు వివరించారు. ఇడుపులపాయలోని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర రెడ్డి ఘాట్‌ వద్ద పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ నివాళులర్పిస్తారని, అనంతరం బస్సు యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించారు. 

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నిర్వహించిన నాలుగు సిద్ధం మహాసభలకు లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వైయస్‌ఆర్‌ సీపీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ నాలుగు సభలు జరిగిన తీరు, హాజరైన లక్షలాది మంది కార్యకర్తలు మా అధినాయకుడు సీఎం వైయస్‌ జగన్‌కు నీరాజనాలు పట్టారు. ఇచ్చినమాట మీద నిలబడి విశ్వసనీయతకు మారుపేరుగా, గత ఐదేళ్ల పాలనలో తొలిసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు మరో 20 ఏళ్ల పాటు కూడా జరగని అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అందించారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను పూర్తిచేసి.. మేనిఫెస్టోకు దానికి కొత్త అర్థాన్ని ఇచ్చారు. 

రాష్ట్ర స్థాయిలో నాలుగుచోట్ల ‘సిద్ధం’ సభల ప్రతిధ్వని వినిపించింది. జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి వైయస్‌ఆర్‌సీపీ వైపు మళ్లింది. దానికి కొనసాగింపుగా మేం సిద్ధం.. మా బూత్‌ సిద్ధం అని బూత్‌ కమిటీలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. 

ఈ ఐదేళ్ల ప్రజారంజక పాలన తరువాత ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన నేపథ్యంలో తరువాతి అడుగుగా సీఎం వైయస్‌ జగన్‌ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈనెల 27వ తేదీ నుంచి వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారు. కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని ఎన్నికల సమరానికి సన్నద్ధం చేయడం కోసం ఈ కార్యక్రమం నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎన్నికల సమరానికి సిద్ధమని చెప్పే సందర్భం. 

సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్‌ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. అందులో ఉజ్జాయింపుగా 27వ తేదీ బస్సు యాత్ర మొదలైతే.. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే ఏప్రిల్‌ 18కి అటుఇటుగా బస్సు యాత్ర ముగియనుంది. వీలైనంత వరకు సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాలు కవర్‌ అవుతాయి. నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత నామినేషన్లు మొదలైనప్పటి నుంచి పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ రెగ్యులర్‌గా ఎన్నికల సభలకు బయల్దేరుతారు. 

పార్టీ పెట్టిన నాటి నుంచి ఎలాగైతే జనంలో మమేకమై పార్టీ పనిచేస్తుందో, అలాగే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అట్టడుగు వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, అభివృద్ధిలో వారి భాగస్వామ్యం, పారదర్శకతతో సంక్షేమ అందించడం కొత్త విధానాలు, కొత్త పథకాలు, సంస్కరణలు తీసుకురావడానికి, జనం కోసం వైయస్‌ జగన్‌ తాపత్రయపడ్డారు. 

ఈనెల 27 నుంచి పూర్తిగా సీఎం వైయస్‌ జగన్‌ జనంలోనే ఉంటారు. పండగలు వచ్చినా, సెలవు దినాలు వచ్చినా జనంలోనే ఉంటారు. ముఖ్యమంత్రి షెడ్యూల్‌ కూడా అలాగే తయారు చేశాం. 27వ తేదీ ఉదయం దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి అదే రోజు మధ్యాహ్నం 3 తరువాత ప్రొద్దుటూరు చేరుకొని మేమంతా సిద్ధం తొలిసభ జరుగుతుంది. అంచనాలకు మించి ఈ సభలు జరుగుతాయి. సీఎం వైయస్‌ జగన్‌ సభకు ఊర్లకు ఊర్లే కదిలివస్తాయి. చిన్నపాటి ఎన్నికల సభ అయినా వేలాది కిక్కిరిపోవడం అందరూ చూశారు. అదే విధంగా సభలు ఉంటాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకో మహాసభ జరుగుతుంది. ఒక పార్లమెంట్‌ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివస్తారా అని అందరూ చూసేలా సభలు జరుగుతాయి. పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ సందేశం పార్లమెంట్‌ నియోజకవర్గం కిందవరకు వెళ్లి, ప్రతి జిల్లా మేము సిద్ధం అని డిక్లేర్‌ చేస్తుంది. ఈ సభలు అలా జరుగుతాయి. 

ఉదయం 9.30 నుంచి 10 గంటల నుంచి వివిధ సంఘాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సామాన్య ప్రజానీకంతో ముఖాముఖి కార్యక్రమం 2 నుంచి 3 గంటల పాటు జరుగుతుంది. అందులో ప్రభుత్వం ఇంకా ఎలా ఉండాలనే అంశంపై సూచనలు, సలహాలు తీసుకుంటారు. విజన్‌ గురించి వివరిస్తారు. 

మధ్యాహ్నం లంచ్‌ తరువాత పార్టీ శ్రేణులను కలుస్తారు. ఆ తరువాత సభ జరిగే నియోజకవర్గానికి వెళ్తారు. వీలైనంత వరకు ఒక పార్లమెంట్‌ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం, మధ్యాహ్నం సమావేశాలు పెడితే బాగుంటుందని షెడ్యూల్‌ తయారు చేస్తున్నాం. అది వీలును, దూరాన్ని బట్టి ఉంటుంది. 

సీఎం వైయస్‌ జగన్‌ను ఒంటరిగా ఢీ కొట్టే ఆలోచన కూడా చేయలేని నేపథ్యంలో ప్రత్యర్థులందరూ ఏకమై వస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేసిన సీఎం వైయస్‌ జగన్‌ ఒంటరిగానే బ‌రిలోకి దిగుతున్నారు. స్పష్టమైన  వైయస్‌ఆర్‌ సీపీ బ్రాండ్‌ విధానాలు చెప్పి పాదయాత్రలో ఏ విధంగా పెద్ద ఎత్తున సూక్ష్మస్థాయిలో సూచనలు, సలహాలు తీసుకున్నారో అదే విధంగా సూచ‌న‌లు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. సభల ద్వారా వైయ‌స్ జ‌గ‌న్ సందేశం ఇస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. నామినేషన్ల తరువాత రెగ్యులర్‌గా వైయస్‌ జగన్‌ పర్యటన జరుగుతుంది. 

తొలిరోజు ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. ఆరోజు రాత్రికే నంద్యాల పార్లమెంట్‌లోకి ఎంటర్‌ అవుతారు. రెండవ రోజు ఉదయం నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది. ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గానికి వస్తారు. ఆ త‌రువాతి రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో సభ ఉంటుంది. ఉదయం ముఖాముఖి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ప్లాన్‌ చేస్తున్నాం. దీని తరువాత ఎప్పటికప్పుడు వైయస్‌ జగన్‌ పర్యటన షెడ్యూల్‌ అందజేస్తాం. పాదయాత్ర సందర్భంగా ఎలా యాక్టివిటీ జరిగిందో అదే విధంగా ఈ బస్సుయాత్ర జరుగుతుంది. 

‘మేమంతా సిద్ధం’ తొలి 3 రోజుల యాత్ర షెడ్యూల్‌..
27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగ‌త మహానేత వైయ‌స్ఆర్ ఘాట్‌ వద్ద వైయ‌స్ఆర్ సీపీ  అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళుల‌ర్పించి యాత్రకు శ్రీకారం చుడ‌తారు.
సాయంత్రం ప్రొద్దుటూరులో తొలి ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభ.

28వ తేదీ ఉదయం నంద్యాల లేదా ఆళ్లగడ్డలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి. సాయంత్రం నంద్యాలలో భారీ బహిరంగ సభ.

29వ తేదీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. పలు రంగాల ప్రముఖులతో ముఖాముఖి. సాయంత్రం ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభ.

Back to Top